WHO: ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు.. కానీ!

కరోనా మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి హెచ్చరించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదైన తరుణంలో ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 19 Jan 2022 20:08 IST

మార్చి నాటికి ఐరోపాలో సగం మందికి ఒమిక్రాన్‌: అంచనా వేసిన ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి హెచ్చరించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదైన తరుణంలో ఆందోళన వ్యక్తం చేసింది. 

‘మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదు. ఒమిక్రాన్ వేరియంట్‌తో సగటున వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు. కానీ, ఇది తేలికపాటి వ్యాధి అనే భావన మాత్రం పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉంది’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ తీవ్ర ఉద్ధృతి చూపుతోంది. మరీ ముఖ్యంగా ఐరోపాను వణికిస్తోంది. తాజాగా జర్మనీలో కేసులు లక్ష దాటాయి. అక్కడ 1,12,323 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే ఫ్రాన్స్‌లో సుమారు 5లక్షల కేసులొచ్చాయి. ఐరోపాలో గత వారం 50 లక్షల కేసులు నమోదయ్యాయి. అక్కడ మార్చి నాటికి సగం మంది ఐరోపా వాసులకు ఒమిక్రాన్ సోకుతుందని ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

మరోపక్క బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో లక్షా 40 వేల కొత్త కేసులొచ్చాయి. గత సంవత్సరం ఆ దేశం కరోనా రెండో వేవ్‌తో ఉక్కిరిబిక్కిరైంది. ఆ సమయంలో ఒక్కరోజే నాలుగువేల మరణాలు సంభవించాయి. కరోనా కేవలం ఫ్లూ అని కొట్టిపారేసిన ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో తీవ్ర విమర్శల పాలయ్యారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను కూడా ఆయన తేలిగ్గా తీసుకుంటున్నారు. అలాగే ఒక దుకాణంలో హ్యామ్‌స్టర్స్‌(ఎలుక జాతి)లో కరోనా వైరస్‌ను గుర్తించడంతో పెంపుడు జంతువులను విక్రయించే దుకాణాలకు సంబంధించి హాంకాంగ్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. 2వేలకు పైగా హ్యామ్‌స్టర్స్‌ను చంపేయాలని నిర్ణయించింది. దాంతో అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ‘పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు