ఔరా..! 4 బంతుల్లోనే లక్ష్య ఛేదన

దేశవాళీ క్రికెట్లో ముంబయి మహిళల జట్టు అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ చేయడమే కాకుండా కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది. సీనియర్‌ వన్డే ట్రోఫీ లీగ్‌ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్‌ ఇందుకు వేదికైంది....

Published : 18 Mar 2021 01:22 IST

నాగాలాండ్‌పై ముంబయి మహిళల ఘన విజయం

ఇండోర్‌: దేశవాళీ క్రికెట్లో ముంబయి మహిళల జట్టు అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ చేయడమే కాకుండా కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది. సీనియర్‌ వన్డే ట్రోఫీ లీగ్‌ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్‌ ఇందుకు వేదికైంది.

హోల్కర్‌ స్టేడియం వేదికగా ముంబయి, నాగాలాండ్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన నాగాలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడమే వారి కొంప ముంచింది. ముంబయి సారథి, మీడియం పేసర్‌ సయాలీ సత్ఘరె (7/5, 8.4 ఓవర్లలో) వారిని బెంబేలెత్తించింది. కేవలం 5 పరుగులిచ్చి 7 వికెట్లు తీసింది. ఆమెకు తోడుగా ఎస్‌. థాకోర్‌ (1/0), దాక్షిణి (2/12) ఆధిపత్యం చెలాయించారు. దాంతో నాగాలాండ్‌ టాప్‌ ఆర్డర్‌లో కికయంగ్లా (0), జ్యోతి (0), సారథి సెంటిలెమ్లా (0), ఎలీనా (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయారు. ఆ జట్టులో కనీసం ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఏడో స్థానంలో ఆడిన సరిబా (9) టాప్‌ స్కోరర్‌.

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి కేవలం 4 బంతుల్లోనే ఆటను ముగించింది. ఓపెనర్‌ ఇషా ఓజా, వృషాలీ భగత్‌ కలిసి మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశారు. 49.2 ఓవర్లు మిగిలుండగానే  10 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగరేశారు.

స్కోరు వివరాలు: నాగాలాండ్‌ 17.4 ఓవర్లల్లో 17 పరుగులకు ఆలౌట్‌. ముంబయి 0.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని