Virat Kohli: వామిక ఫొటో వైరల్‌ కావడంపై స్పందించిన విరుష్క... ఏమన్నారంటే?

ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి వన్డే సందర్భంగా..విరాట్ కోహ్లీ, అనుష్కల కుమార్తె వామిక కెమెరాల కంట పడింది.

Updated : 24 Jan 2022 14:35 IST

దిల్లీ: ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి వన్డే సందర్భంగా.. విరాట్ కోహ్లీ, అనుష్కల కుమార్తె వామిక కెమెరాల కంట పడింది. దాంతో వెనువెంటనే ఆ చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వామిక జన్మించి ఏడాది పూర్తైనా కోహ్లీ జంట తమ కుమార్తె ఫొటోలు, వీడియోలు ఇంతవరకు బయటపెట్టలేదు. తమ బిడ్డ విషయంలో గోప్యత పాటించాలనుకుంటున్నట్లు వారు గతంలోనే కోరారు. కానీ, ఇప్పుడు పాపకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ వైరల్‌ కావడంపై వారు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.

‘స్టేడియంలో తీసిన మా పాప చిత్రాలు విపరీతంగా షేర్ అయ్యాయని తెలిసింది. ఇలా జరుగుతుందని మేము ఊహించలేకపోయాం. ఆ సమయంలో కెమెరాలు మా వైపు ఉన్నాయని తెలియదు. వామిక గోప్యత విషయంలో ఇప్పటికీ మా వైఖరి, అభ్యర్థనలో ఎటువంటి మార్పులేదు. మా విజ్ఞప్తిని గౌరవించి వామిక ఫొటోలు ప్రచురించని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు విరుష్క. 

ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకం సాధించాడు. అర్ధ శతకాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ చేతిలో బ్యాటు పెట్టుకొని బిడ్డను ఆడించినట్లు చేతులూపాడు. అప్పుడే అనుష్క తన చేతుల్లో ఉన్న వామికకు తండ్రిని చూపిస్తూ.. చప్పట్లు కొట్టింది. కాసేపటికి వామిక కూడా చప్పట్లు కొట్టింది. ఈ మొత్తం దృశ్యం టీవీ లైవ్‌లో అందరికీ కనిపించింది. దీంతో వామిక తొలి ఫొటో అంటూ ఆ  వీడియో స్క్రీన్‌ షాట్స్‌ వైరల్‌ అయ్యాయి. దీనిపై విరుష్క అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామిక ఫొటో ఉన్న ట్వీట్లను తొలగించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని