Peng Shuai Missing: పెంగ్‌ షువాయి.. కనిపించడం లేదా.. కనిపించకుండా చేశారా?

చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి, మాజీ డబుల్స్‌ నంబర్‌వన్‌ పెంగ్‌ షువాయి ఆచూకీ తెలియడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఉధృతమైంది. దీంతో ఆమె క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు...

Updated : 21 Nov 2021 11:35 IST

క్షేమంగానే ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు

చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి, మాజీ డబుల్స్‌ నంబర్‌వన్‌ పెంగ్‌ షువాయి ఆచూకీ తెలియడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఉద్ధృతమైంది. దీంతో ఆమె క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు, వీడియోలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు నిజంగా ఏదైనా జరిగిందా..? లేక కావాలనే బయటి ప్రపంచానికి దూరంగా ఉందా? అర్థం కావడం లేదు.

అసలేంటీ వివాదం..?

చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్‌ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఈనెల 2న పెంగ్‌ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. జాంగ్‌ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే షువాయికి ఏమైందోనని అభిమానులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘పెంగ్‌ ఎక్కడ?’’ అంటూ సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై పురుషుల, మహిళల టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యులు సైతం ఆమెకు ఏమైందో తెలియజేయాలంటూ చైనా అధికారులను కోరారు.

ఎవరెవరు స్పందించారంటే..

పెంగ్‌ ఆచూకీ తెలియకపోవడంపై ఇటీవల జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాక, సెర్బియన్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌, అమెరికా స్టార్‌ సెరీనా విలియమ్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడుందని నిలదీశారు. ‘‘మీకు ఈ వార్త గురించి తెలుసో లేదో కానీ ఓ సహచర టెన్నిస్‌ క్రీడాకారిణి కనిపించడం లేదని నాకు సమాచారం అందింది. లైంగిక దాడికి గురయ్యానని ఆమె చెప్పిన తర్వాతే ఆచూకీ దొరకడం లేదు. మహిళల్ని అణచివేయడమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. ఈ పరిస్థితి షాక్‌కు గురిచేసింది’’ అని ఒసాక పోస్టు చేసింది. అలాగే పెంగ్‌ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ కూడా డిమాండ్‌ చేశాడు. సెరెనా సైతం స్పందించింది. ‘‘పెంగ్‌ కనిపించడం లేదనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె క్షేమంగానే ఉందని.. త్వరలోనే బయటకు వస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంపై విచారణ జరపాలి. దీనిపై నిశ్శబ్దంగా ఉండలేం’’ అంటూ ట్వీట్‌ చేసింది.

డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ అనుమానం..

మరోవైపు పెంగ్‌ సురక్షితంగానే ఉన్నానని, తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఇటీవల డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ స్టీవ్‌ సిమన్‌కు ఆమె ఈ మెయిల్‌ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ఇటీవల ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, దీనిపై స్పందించిన సిమన్‌.. ఆమె నుంచి వచ్చిన ఈ మెయిల్‌పై తనకు సందేహాలున్నాయని స్పష్టం చేశారు. పెంగ్‌ ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా వెనకాడబోమని గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా, పెంగ్‌ క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ నుంచి సమాచారం అందిందని ఏటీపీ ఛైర్మన్‌ గాడెంజి పేర్కొనడం గమనార్హం.

పెంగ్‌ ఆచూకీపై పెదవి విప్పని చైనా..

పెంగ్‌ షువాయి ఆచూకీపై ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా ఆ దేశం మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ క్రమంలోనే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి జావో లిజియాన్‌ మాట్లాడుతూ.. ఇది దౌత్యపరమైన విషయం కానందున తనకు పూర్తి సమాచారం తెలియదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధికారిక ప్రతినిధి లిజ్‌ త్రోసెల్‌ మాట్లాడుతూ.. పెంగ్‌ క్షేమంగా ఉన్నారనే సరైన సమాచారం తమకు కావాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి దాపరికాలు లేని విచారణ జరగాలని ఆదేశించారు. ఆమె క్షేమంగా ఉండటం ముఖ్యమన్నారు.

ఫొటోలు, వీడియోలు కలకలం..

ఇక పెంగ్‌ ఫొటోలు, వీడియోలు తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అక్కడి సీజీటీఎన్‌ ఛానల్‌ ఉద్యోగి షెన్‌ షీవీ.. పెంగ్‌ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్‌ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్‌ స్వయంగా ఈ ఫొటోలు పోస్టు చేసిందని ఆయన ట్వీట్‌లో తెలిపాడు. అక్కడి అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ హూ జిజిన్‌ సైతం.. ‘‘అనధికార సమాచారం ప్రకారం ఈ ఫొటోలు పెంగ్‌ ప్రస్తుత పరిస్థితిని తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉంది. తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోంది. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంది’’ అని పేర్కొన్నాడు.

సాధారణ ప్రజల అనుమానం..

లైంగిక దాడి ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఇంతలా ఉద్యమం జరుగుతుంటే సొంతంగా బయటకు రావొచ్చు కదా అని సాధారణ ప్రజలు ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇలా అధికార పార్టీకి చెందిన మీడియాలో ఆమె గురించి వార్తలు రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పెంగ్‌ ఆచూకీ చెప్పాలంటూ అంతర్జాతీయ స్థాయిలోనూ చైనాపై ఒత్తిడి పెరిగింది. పెంగ్‌ క్షేమ సమాచారంపై సాక్ష్యాలు చూపించాలని యూఎస్‌ ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకి సైతం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో రెండున్నర నెలల్లో శీతాకాల ఒలింపిక్స్‌కు చైనా ఆతిథ్యమివ్వాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పెంగ్‌ ఆచూకీ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని