Tokyo Paralympics: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. సుమిత్‌ మూడుసార్లు ప్రపంచ రికార్డు

పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్‌ మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన...

Updated : 30 Aug 2021 17:39 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్‌ బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్‌ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్‌ బురియన్‌ 66.29 మీటర్లతో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్‌ దులాన్‌ కొడితువక్కు 65.61 మీటర్లతో మూడో స్థానంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. భారత్‌ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.

హరియాణాలోని సోనేపట్‌కు చెందిన సుమిత్‌ 2015 వరకు అందరి యువకుల్లానే సాదాసీదాగా ఉన్నాడు. అయితే, అప్పుడు జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌లో ఎడమకాలు పోగొట్టుకొని కృత్రిమకాలుతో జీవనం సాగిస్తున్నాడు. తన ఊర్లో ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్‌ కూడా అథ్లెటిక్స్‌ వైపు దృష్టి మళ్లించాడు. అలా 2018లో జావెలిన్‌ త్రో విభాగంలో పోటీపడటం ప్రారంభించి ఇప్పుడు పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేవరకు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. ఈ క్రమంలోనే 2019లో దుబాయ్‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఎఫ్‌-64 విభాగంలోనే పోటీపడి రజతం సాధించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో పాటియాలాలో నిర్వహించిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి సిరీస్‌ 3 పోటీల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రాతో పోటీపడ్డాడు. అయితే, సుమిత్‌ అప్పుడు 66.43 మీటర్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు చోప్రా 88.07 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని