Tim Paine: టిమ్‌పైన్‌కు ఓటు వేయాల్సి వస్తే.. పక్కకు తప్పుకొంటా

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌పైన్‌ను తుది జట్టులో ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే...

Published : 24 Nov 2021 01:25 IST

ఆస్ట్రేలియా చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌పైన్‌ను తుది జట్టులో ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే.. తాను పక్కకు తప్పుకొంటానని ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ అన్నారు. 2017లో తన సహచర ఉద్యోగికి పైన్‌ అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఇటీవల ఆ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో టిమ్‌పైన్‌ ఒకడు. అందులో ఇతడొక్కడే వికెట్‌ కీపర్‌ కావడం గమనార్హం. అయితే, డిసెంబర్‌ 8న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అతడిని ఇంకా కచ్చితంగా ఎంపిక చేయలేదని బెయిలీ ఓ పోడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో తెలిపారు.

‘ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ఎంపిక చేసే ప్రక్రియలో జట్టు యాజమాన్యం పైన్‌ను ఆడడానికి అనుమతించని పక్షంలో ఓటింగ్‌ పద్ధతి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు నేను పక్కకు తప్పుకొని ఆ బాధ్యతలను మరో సెలెక్టర్‌ టోనీ డోడ్‌మెయిడ్‌, ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు అప్పగిస్తా. వాళ్లిద్దరూ ఆ పని చూసుకుంటారు’ అని బెయిలీ చెప్పుకొచ్చారు. కాగా, బెయిలీ.. టిమ్‌పైన్‌కు అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా ఒక వ్యాపారంలో భాగస్వామి కూడా. ఈ నేపథ్యంలోనే పైన్ ఎంపిక ప్రక్రియలో ఓటింగ్‌ పద్ధతి తీసుకొస్తే తాను తప్పుకొంటానని స్పష్టం చేశారు. మరోవైపు పైన్.. అసభ్య సందేశాల వివాదం నేపథ్యంలో తాను కెప్టెన్‌గా వైదొలిగినా ఆటగాడిగా యాషెస్‌ సిరీస్‌లో ఆడతానని ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని