T20 World Cup: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాదే విజయం

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌

Updated : 30 Oct 2021 19:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ బావుమా (46) రాణించగా.. మార్‌క్రమ్‌ (19) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు ఎక్కువ ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే, డేవిడ్‌ మిల్లర్ (23; 13 బంతుల్లో 2 సిక్స్‌లు), రబాడ (13; 7 బంతుల్లో 1 ఫోర్‌, ఒక సిక్స్‌) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, చమీర రెండు వికెట్లు పడగొట్టారు.

శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దుష్మంత చమీర వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర్లు రీజా హెండ్రిక్స్‌ (11), క్వింటన్‌ డికాక్‌ (12) పెవిలియన్‌ చేరారు. డస్సెన్‌ (16) చమిక కరుణరత్నే వేసిన 7.6 బంతికి రనౌటయ్యాడు. దీంతో పది ఓవర్లకు దక్షిణాఫ్రికా 62/3 వద్ద నిలిచింది. తర్వాత బావుమా, మార్‌క్రమ్ నిలకడగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 15 ఓవర్‌లో మార్‌క్రమ్ ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 96/4. వికెట్లు పడినప్పటికీ సౌతాఫ్రికా గెలుపు ఖాయంగానే కనిపించింది. కానీ, 18వ ఓవర్‌లో హసరంగ మాయ చేశాడు. బావుమా, ప్రిటోరియస్‌ని పెవిలియన్‌కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా... డేవిడ్‌ మిల్లర్, రబాడ ధాటిగా ఆడటంతో ఒక బంతి మిగిలుండగానే ఆ జట్టు విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. నార్జ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో శ్రీలంక తొలి వికెట్‌ని కోల్పోయింది. అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (7) ఔటయ్యాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 39/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన చరిత్‌ అసలంక (21), మరో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంకతో కలిసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే కేశవ్‌ మహరాజ్‌ వేసిన 9వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4) వరుసగా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్‌ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే శ్రీలంక మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వచ్చిన దసున్ శనక (11), చమిక కరుణరత్నే (5), దుష్మంత చమీర (3) వరుసగా పెవిలియన్‌ చేరారు. మహేశ్‌ తీక్షణ (7) నాటౌట్‌గా నిలిచాడు. నిశాంక రాణించినా అతడికి సహకరించే బ్యాటర్‌ లేకపోవడంతో శ్రీలంక పెద్దగా స్కోరు చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్‌ షంసి, డ్వెయిన్‌ ప్రిటోరియస్ మూడేసి, అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని