IND vs SA: రెండో వన్డేలోనూ టీమ్‌ఇండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమిపాలైంది. భారత్‌  నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యా్న్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని

Updated : 21 Jan 2022 22:28 IST

పార్ల్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమిపాలైంది. భారత్‌  నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలన్‌ (91; 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), క్వింటన్ డికాక్‌ (78; 66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా.. డసెన్‌ (37), మార్‌క్రమ్‌ (37), బవుమా (35) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చాహల్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్‌ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. మలన్‌ కూడా నిలకడగా ఆడాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 66/0తో నిలిచింది. డికాక్‌ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తర్వాత మలన్‌ దూకుడు పెంచి ఆడి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 22 ఓవర్‌లో డికాక్‌ని శార్దూల్ ఠాకూర్‌ వెనక్కి పంపి భారత్‌కి ఊరటనిచ్చాడు. తర్వాత దూకుడుని కొనసాగిస్తూ శతకం వైపు దూసుకెళ్తున్న మలన్‌ని బుమ్రా పెవిలియన్‌కి పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే బవుమా (35) చాహల్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డసెన్‌, మార్‌క్రమ్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్‌ (85; 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (55; 79 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా.. విరాట్ కోహ్లీ (0) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్‌ (11), వెంకటేశ్ అయ్యర్‌ (22) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (40*), అశ్విన్‌ (25*) నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి రెండు, మగళ, కేశవ్‌ మహారాజ్‌, మార్‌క్రమ్, పెహులుక్వాయో తలో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని