బుమ్రాకి కాదు.. కపిల్ దేవ్‌లా నిఖార్సైన ఆల్ రౌండర్‌కి పగ్గాలివ్వాలి: రవిశాస్త్రి

టీమ్ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్‌ లాంటి నిఖార్సైన ఆల్‌ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే...

Published : 28 Jan 2022 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్‌ లాంటి నిఖార్సైన ఆల్‌ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్‌ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్ పంత్‌ టీమ్‌ఇండియా కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బీసీసీఐ, జట్టు యాజమాన్యం భవిష్యత్‌ కెప్టెన్‌ను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

‘బుమ్రాకు టెస్టు పగ్గాలు అప్పగించాలనడం సరికాదు. నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. భారత జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. జట్టులో స్థానం కోసం ఎదురు చూసే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి, టీమ్‌ఇండియాలో ఫాస్ట్ బౌలర్‌ సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగలేడు. అందుకే, ఒక పేసర్‌ కెప్టెన్‌గా వ్యవహరించడమనేది చాలా కష్టం. ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా ఉండాలంటే.. బ్యాటుతోనూ రాణించాల్సి ఉంటుంది. లేదంటే బాబ్‌ విల్లీస్‌లా ఎప్పుడూ జట్టులో ఉండే ఆటగాడైనా కావాలి. అలాంటి బౌలర్‌ భారత్‌తో దొరకడం చాలా అరుదు. ఇవేవీ కాకుంటే.. కపిల్ దేవ్‌, సర్ గార్‌ఫీల్డ్‌లా నిఖార్సైనా ఆల్ రౌండర్‌కు అయినా టీమ్‌ఇండియా టెస్టు పగ్గాలు అప్పగించాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.

‘టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం వస్తే.. జట్టుని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని బుమ్రా గతంలో చెప్పాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన బుమ్రాకు వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని