మమ్మల్ని ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారు

ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని...

Published : 27 Feb 2021 17:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని, టెస్టు క్రికెట్‌కు సరిపోదని తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలకు భిన్నంగా ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని తన అభిప్రాయం వెల్లడించాడు. మ్యాచ్‌ ఇలా త్వరగా పూర్తవ్వడం నిరాశ కలిగించినా అందుకు ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమేనని చెప్పుకొచ్చాడు. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు తేలిపోయారని అన్నాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తమని ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారని పీటర్సన్‌ వీడియోకు కామెంట్‌ చేశాడు.

‘‘రెండు జట్లలోనూ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. పేలవంగా ఆడామనే ఒప్పుకుంటారు. మొత్తంగా 30లో 21 వికెట్లు.. నేరుగా వికెట్‌ టు వికెట్‌ విసిరిన బంతులకే పడ్డాయి. పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. బ్యాట్స్‌మెన్‌ కాస్త జాగ్రత్తగా ఆడాల్సింది. అలా ఆడి ఉంటే ఈ టెస్టు మూడు లేదా నాలుగు రోజులకు వెళ్లేది’ అని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ వీడియోలో అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా, భారత్‌ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 81 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు ఇదే స్టేడియంలో మార్చి 4న జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని