T20 World Cup: స్కాట్లాండ్‌పై పాక్‌ ఘన విజయం

పాకిస్థాన్‌ మరోసారి సత్తాచాటింది. వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగుల తేడాతో గెలుపొందింది. 

Published : 08 Nov 2021 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మరోసారి సత్తాచాటింది. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 గ్రూప్‌2లో వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించి పాక్‌ అగ్రస్థానంలో నిలిచింది. షార్జా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. బాబర్ అజామ్‌ (66), షోయబ్ మాలిక్ (54 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 117 పరుగుల చేసింది. స్కాట్లాండ్‌ జట్టులో బెరింగ్‌టన్‌ (54 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. మిగతావారు విఫలమవడంతో ఆ జట్టు 117 పరుగులకే పరిమితమైంది. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీయగా, హసన్‌ అలీ, షహీద్‌ అఫ్రిదీ, రవూఫ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. షోయబ్‌ మాలిక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వచ్చింది.   

షోయబ్‌ మాలిక్‌ సిక్సర్ల మోత..

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్ అజామ్‌ (66: 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), షోయబ్ మాలిక్ ( 18 బంతుల్లో 54*: ఒక ఫోర్‌, 6 సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో చెలరేగడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది. తొలుత నిదానంగా ఆడిన పాక్‌.. ఆఖర్లో చెలరేగింది. మహమ్మద్‌ రిజ్వాన్‌ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాబర్ మొదట్లో ఆచితూచి ఆడాడు. ఫఖర్ జమాన్ (8) విఫలం కాగా.. మహమ్మద్‌ హఫీజ్‌ (31) ధాటిగా ఆడాడు. అయితే ఆఖర్లో మాలిక్ విశ్వరూపం చూపాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో గ్రీవ్స్‌ 2.. తహిర్, షరిఫ్ చెరో వికెట్ తీశారు.

సెమీస్‌లో తలపడనున్న జట్లు..

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో తలపడే జట్లు ఖరారు అయ్యాయి. ఈ నెల 10న గ్రూప్‌ 1లో మొదటి స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, గ్రూప్‌ 2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీస్‌ జరగనుండగా, 11న గ్రూప్‌ 2లో మొదటి స్థానంలో నిలిచిన పాకిస్థాన్‌, గ్రూప్‌1లో రెండోస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్‌ జరగనుంది. ఇక గ్రూప్‌2లో భారత్‌-నమీబియా మధ్య మరో మ్యాచ్‌ మిగిలింది. అయితే ఇది నామమాత్రపు మ్యాచే. ఇప్పటికే గ్రూప్‌2లో పాక్‌ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, నాలుగు విజయాలతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ జట్టు ఒక వేళ గెలిచి ఉంటే భారత్‌కు సెమీస్‌ చేరుకునే అవకాశం ఉండేంది. ఆ జట్టు ఓటమితో భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని