IND vs SA: మిడిలార్డర్‌ రాణించిఉంటే ఫలితం మరోలా ఉండేది: కేఎల్ రాహుల్‌

qదక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమిపై స్పందిస్తూ.. మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా...

Published : 20 Jan 2022 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ‘‘తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. తర్వాతి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’’ అని టీమిండియా వన్డే కెప్టెన్‌ కేఎల్ రాహుల్ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమిపై స్పందిస్తూ.. మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అన్నాడు. మరోవైపు భారత్‌పై విజయం సాధించడంతో సఫారీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా చెప్పాడు.

మేం ఆటను గొప్పగా ప్రారంభించాం. కానీ, మిడిలార్డర్‌లో కీలక భాగస్వామ్యాలను విడగొట్టలేకపోయాం. 20 - 25 ఓవర్ల వరకు మేమే ఆధిక్యంలో ఉన్నాం. ఆ తర్వాత ఆట అనూహ్యంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లను నిలువరించలేకపోయాం. ఆఖర్లో 20 పరుగులు అదనంగా ఇచ్చినట్లనిపించింది. ఛేదనలో విరాట్, శిఖర్‌ ధావన్‌ మెరుగైన ఆటను ప్రదర్శించారు. నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే, సఫారీ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి భారత్‌ని దెబ్బ తీశారు. మిడిలార్డర్ బ్యాటర్లు కాస్త కుదురుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. చాలా కాలంగా మేం వన్డే క్రికెట్ ఆడలేదు. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటాం

- కేఎల్‌ రాహుల్‌, టీమిండియా కెప్టెన్‌

భారత్‌పై విజయం సాధించడం ద్వారా మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నింగ్స్ సాంతం చాలా కష్టపడ్డాను. వాండర్‌ డస్సెన్‌కు సహకరిస్తూ నిలకడగా ఆడాను. అతని దూకుడు చూసి వేరే పిచ్‌పై ఆడుతున్నాడేమో అనిపించింది. మేమిద్దరం నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించింది. డెత్ ఓవర్లలో స్పిన్నర్ తబ్రెయిజ్‌ షంసి గొప్పగా బౌలింగ్ చేశాడు. కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను నిలువరించాడు

- తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్‌

బొలాండ్ పార్క్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే అదే వేదికపై 21న (శుక్రవారం) జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని