IPL 2021: కోహ్లీ జట్టులో ఏదో సమస్య ఉంది.. త్వరగా పరిష్కరించుకోవాలి

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని, లేకపోతే ఇలా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంత మంచి ఆరంభం దక్కినా ఓటమిపాలవ్వడం సరికాదని...

Updated : 26 Sep 2021 02:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఏదో సమస్య ఉందని, లేకపోతే ఇలా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంత మంచి ఆరంభం దక్కినా ఓటమిపాలవ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ విశ్లేషించాడు. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

‘కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన జట్టు చెన్నైతో మొదట మెరుగైన స్థితిలో నిలిచినా చివరికి ఓటమిపాలైంది. అంటే ఈ జట్టులో ఏదో సమస్య ఉంది. 111 పరుగుల వరకూ ఒక్క వికెట్‌ కోల్పోని జట్టు తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది. అందులో ఏదో ఇబ్బంది ఉంది. అదేంటో తెలుసుకొని త్వరగా పుంజుకోవాలి. మరోవైపు బౌలింగ్‌లోనూ బెంగళూరు సతమతమవుతోంది. మనమెప్పుడూ ఆ జట్టులో వికెట్లు తీసే బౌలర్‌ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాం. చాహల్‌ వికెట్లు తీస్తున్నా ప్రతిసారీ అతడి నుంచే ఆశించడం సరికాదు. ఎవరైనా ఒకరు తోడుగా ఉండాలి. ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌ నుంచి సహకారం లభించాలి’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 156/6 స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు కోహ్లీ (53), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (70) దంచికొట్టి తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు విజయానికి కావాల్సిన అద్భుతమైన బాట వేశారు. అయితే, బ్రావో 14వ ఓవర్‌లో కోహ్లీని ఔట్‌ చేయగా.. శార్దూల్‌ 17వ ఓవర్‌లో డివిలియర్స్‌(12), దేవ్‌దత్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపాడు. చివర్లో మాక్స్‌వెల్‌(11)తో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమై చెన్నై ముందు మోస్తరు లక్ష్యం నిర్దేశించారు. అనంతరం చెన్నై బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ (38), డుప్లెసిస్‌(31), మొయిన్‌ అలీ(23), అంబటి రాయుడు (32), రైనా (17*), ధోనీ(11*) తలా కొన్ని పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో ధోనీసేన పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని