Ajinkya Rahane: కెప్టెన్‌పై వేటు తప్పదా?

కోహ్లి అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు అజింక్య రహానె. ఈ మ్యాచ్‌లో జట్టును నడిపించిన అతను.. తర్వాతి టెస్టుకు తుది జట్టులోనే చోటు కోల్పోతే ఆశ్చర్యమేమీ

Updated : 29 Nov 2021 07:06 IST

కోహ్లి అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు అజింక్య రహానె. ఈ మ్యాచ్‌లో జట్టును నడిపించిన అతను.. తర్వాతి టెస్టుకు తుది జట్టులోనే చోటు కోల్పోతే ఆశ్చర్యమేమీ లేదు. ఫామ్‌ ప్రకారం చూస్తే రహానెపై కచ్చితంగా వేటు పడాల్సిందే. 2020 ఆఖర్లో ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించాక.. గత 24 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్కసారీ సెంచరీ చేయలేదు. రెండు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. జట్టు అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలాసార్లు రహానె ఘోరంగా విఫలమై నిరాశ పరిచాడు. ప్రస్తుత టెస్టులోనూ అంతే. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులే చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉండగా 4 పరుగులకే వెనుదిరిగి సంకట స్థితిలోకి నెట్టాడు. నిరుడు ఆస్ట్రేలియాలో తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత కోహ్లి స్వదేశానికి వచ్చేస్తే.. సారథ్య బాధ్యతలందుకుని తర్వాతి టెస్టులో అద్భుత శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాక, కీలక ఆటగాళ్లు మరిందరి సేవలు కోల్పోయినా జట్టును గొప్పగా నడిపించి సిరీస్‌ సాధించడంతో రహానెకు గొప్ప పేరు వచ్చింది. కానీ ఆ సిరీస్‌కు ముందు, తర్వాత అతడిది వైఫల్యాల పరంపరే. శ్రేయస్‌ అరంగేట్ర టెస్టులోనే శతకంతో సత్తా చాటిన నేపథ్యంలో రెండో టెస్టుకు అతను కొనసాగడం ఖాయం. ఈ మ్యాచ్‌కు కోహ్లి తిరిగొస్తాడు కాబట్టి రహానె లేదా పుజారాల్లో ఒకరిపై వేటు వేయక తప్పదు. పరుగుల్లో పుజారా కన్నా రహానేనే వెనుకబడి ఉన్న నేపథ్యంలో న్యాయంగా చూస్తే అతడినే పక్కన పెట్టాలి. అయితే రహానె వైస్‌ కెప్టెన్‌. పైగా తొలి టెస్టులో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే అవకాశం కూడా ఉంది. ఈ స్థితిలో రహానెపై వేటు వేసే సాహసం జట్టు యాజమాన్యం చేస్తుందా అన్నది ప్రశ్న.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని