అక్తర్‌ ‘దెబ్బకు’ క్రికెట్‌ ఆడాలా అనుకున్నా..!

2004 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారాను గాయపర్చిన  సంఘటన నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు...

Published : 25 May 2021 01:18 IST

2004 బ్రియన్‌ లారా సంఘటన గుర్తుచేసిన డారెన్‌ సామి

ఇంటర్నెట్‌డెస్క్‌: 2004 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారాను గాయపర్చిన  సంఘటన నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకునే విషయంపై సందేహం కలిగిందని చెప్పాడు. సామి సోమవారం ఓ పాకిస్థాన్‌ మీడియాతో మాట్లాడుతూ నాటి సంఘటన గురించి పూసగుచ్చినట్టు వివరించాడు.

‘2004లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా నేను వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేసినప్పుడు రోజ్‌బౌల్‌ మైదానంలో పాకిస్థాన్‌తో ఓ మ్యాచ్‌ జరిగింది. అప్పుడా జట్టు మహ్మద్‌ సమి, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌తో బౌలింగ్‌ చేయించింది. ఆరోజు అక్తర్‌ వేసిన ఓ బంతి లారా తలకు తగిలింది. దాంతో వెంటనే అతడు కిందకు పడిపోయాడు. అప్పుడు బ్రావో పక్కనే కూర్చున్న నేను.. ఇది చూశాక మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నావా? అని నాకు నేనే ప్రశ్నించుకున్నా. అక్తర్‌ నన్ను అలా అనుకునేలా చేశాడు’ అని సామి నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 38.2 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ యాసిర్ హమీద్‌(39; 56 బంతుల్లో 6x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(21), షోయబ్‌ మాలిక్‌(17), మహ్మద్‌ యూసుఫ్‌(12) విఫలమయ్యారు. ఆపై విండీస్‌ స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ లారా(31; 30 బంతుల్లో 5x4) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగ్గా రామ్‌నరేశ్‌ శర్వాన్‌(56 నాటౌట్‌; 85 బంతుల్లో 6x4, 1x6) చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని