Nathan Lyon: వారిని వారి గడ్డపైనే  ఓడించాలి.. ఆ జట్టులో నేనుండాలి: నాథన్‌ లియోన్‌

ఎన్ని వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడినా.. కెరీర్‌లో ఒక్కసారైనా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఆటగాడి కల..

Published : 14 Nov 2021 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఎన్ని వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడినా.. కెరీర్‌లో ఒక్కసారైనా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఆటగాడి కల. ఇక భారత్‌-పాకిస్థాన్‌, భారత్‌-ఆస్ట్రేలియా, భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్‌ అయినా సరే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడటం మినహా టీమ్‌ఇండియా, పాక్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేనేలేవు. మరో వైపు ఆసీస్‌, ఇంగ్లాండ్‌ను వారి గడ్డపైనే ఓడించి మరీ భారత్‌ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఇక మన మైదానాల్లో అయితే టీమ్‌ఇండియాకు తిరుగే ఉండదు. ఈ క్రమంలో మన దేశంలోనే భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించాలని.. ఆ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నాడు ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌. షెడ్యూల్‌ ప్రకారం అయితే గత అక్టోబర్‌లోనే ఆసీస్‌ పర్యటన ఉండాల్సింది. అయితే ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో పర్యటనను బీసీసీఐ వాయిదా వేసింది.

భవిష్యత్తులో తన లక్ష్యం గురించి నాథన్‌ లియోన్‌ మాట్లాడుతూ.. ‘‘ భారత్‌పై వారి గడ్డమీదే ఆసీస్‌ గెలవాలి. ఆ జట్టులో నేను సభ్యుడిని కావాలి. ఇదే నాకున్న అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి. టెస్టు సిరీస్‌లో నేను కీలక పాత్ర పోషిస్తాననే నమ్మకం ఉంది’’ అని స్పష్టం చేశాడు. ఆసీస్‌ తరఫున వంద టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన నాథన్‌ 399 వికెట్లను పడగొట్టాడు. 400 వికెట్ల మైలురాయికి కేవలం ఒకే ఒక్క వికెట్‌ దూరంలో ఉన్నాడు. గతేడాది టీమ్‌ఇండియా ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో లియోన్ మొత్తం 9 వికెట్లను మాత్రమే తీయగలిగాడు. వచ్చే డిసెంబర్‌ 8 నుంచి ఇంగ్లాండ్‌-ఆసీస్ మధ్య యాషెస్‌ సిరీస్‌ (ఐదు టెస్టులు) ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటి నుంచే లియోన్‌ సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకోవాలని ఆసీస్‌ ఆదివారం (నవంబర్‌ 14) కివీస్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని