TS News: బండి సంజయ్‌ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనను తెరాస

Updated : 24 Sep 2022 15:06 IST

సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనను తెరాస శ్రేణులు మరోసారి అడ్డుకునేందుకు యత్నించాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. భాజపా శ్రేణులపై తెరాస కార్యకర్తలు రాళ్లు రువ్వారు. బండి సంజయ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన భాజపా శ్రేణులపై తెరాస వర్గీయులు కర్రలతో దాడికి యత్నించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అంతకుముందు చివ్వెంలలో ఇదే పరిస్థితి తలెత్తింది. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో పోటీగా తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఆత్మకూరు (ఎస్‌)లో ఉద్రిక్త వాతావరణం..

పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌)కు చేరుకున్న బండి సంజయ్‌కి మరోసారి తెరాస శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. బండి సంజయ్‌ని అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ తెరాస శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. బండి సంజయ్‌ రాకతో ఆత్మకూరు (ఎస్‌)లోని ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది. అక్కడ భాజపా, తెరాస శ్రేణులు భారీగా మోహరించాయి. భాజపా, తెరాస కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆత్మకూరు(ఎస్) వద్ద ఘర్షణ జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే శ్రీనివాస్‌ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.

బండి సంజయ్‌పై కేసు నమోదు: నల్గొండ ఎస్పీ

బండి సంజయ్‌ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు. అనుమతి లేకుండా పర్యటించారని సంజయ్‌తో పాటు పలువురు భాజపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని