‘సమాజ్‌వాదీ అత్తర్‌’తో సోషలిజం పరిమళిస్తుందట!..

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి! హామీలు ప్రకటిస్తూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. ఓటర్లను...

Updated : 10 Nov 2021 13:45 IST

 పెర్ఫ్యూమ్‌లను విడుదల చేసిన అఖిలేశ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. హామీలు ప్రకటిస్తూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. ఓటర్లను ఆకట్టుకునే దిశగా విభిన్న ప్రయత్నం చేశారు. ‘సమాజ్‌వాదీ అత్తర్’ పేరిట తయారు చేసిన పెర్ఫ్యూమ్‌లను మంగళవారం విడుదల చేశారు. 2022 ఎన్నికల్లో ఈ సెంట్ తన అద్భుతాన్ని చూపిస్తుందన్నారు. దీన్ని దాదాపు 22 రకాల సహజ పరిమళాలతో తయారు చేశారట. ఆగ్రా, లఖ్‌నవూ, వారణాసి, కన్నౌజ్ నగరాల అత్తరు సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.

కన్నౌజ్‌కు చెందిన పార్టీ నేత, యూపీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఈ పెర్ఫ్యూమ్‌ను ఉపయోగించినప్పుడు.. ‘సోషలిజం’ పరిమళం రావడాన్ని గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ సెంట్‌ 2022లో ద్వేషాన్ని అంతం చేస్తుందని వివరించారు. పెర్ఫ్యూమ్ డబ్బాపై అఖిలేష్ యాదవ్ ఫొటో, పార్టీ ఎన్నికల గుర్తు ఉంది. ఎస్పీ ఈ తరహా ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లోనూ అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో తన ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్‌వాదీ సుగంధ్' పేరిట అనేక రకాల పెర్ఫ్యూమ్‌లను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని