జిన్నా వివాదం: ‘వెళ్లి చరిత్ర పుస్తకాలు చదవండి’.. అఖిలేశ్ వ్యాఖ్యలు
పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించకున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.
లఖ్నవూ: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించకున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వారు మరోసారి చరిత్ర పుస్తకాలు తిరగేయాలని సూచించారు. జిన్నా, నెహ్రూ, పటేల్, గాంధీ అంతా దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడారని, వారందరూ ఒకే సంస్థలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారని ఇటీవల ఓ సందర్భంలో అఖిలేశ్ వ్యాఖ్యానించారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు భాజపా నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అఖిలేశ్ ఈ విధంగా స్పందించారు.
తానెక్కడి నుంచైనా పోటీచేస్తానన్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపైనా ఈ సందర్భంగా అఖిలేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయేవారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఏం లాభం? అని ప్రశ్నించారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే, తన నిర్ణయం బహుశా మారకపోవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని ఇది వరే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలపై భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. ‘జిన్నాపై ఇంకా ప్రేమ చెక్కు చెదరలేదు. ఇంతకీ ఏ చరిత్ర పుస్తకాలు చదవాలి అఖిలేశ్ జీ.. భారత్వా... పాకిస్థాన్వా..?’ అని ఆయనను ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.