UP Polls: రైతులపై అఖిలేశ్‌ హామీల వర్షం.. ప్రతి పంటకూ MSP.. ఇంకా!

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. భాజపాను ఓడించి అధికార పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా రైతాంగాన్ని .....

Published : 18 Jan 2022 01:47 IST

లఖ్‌నవూ: యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. భాజపాను ఓడించి అధికార పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా రైతాంగాన్ని తమవైపు ఆకర్షించుకొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ హామీల వర్షం కురిపించారు. లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంటకూ కనీస మద్దతు ధర (MSP) ఇవ్వడంతో పాటు ఉచిత నీటిపారుదల వసతులు సమకూరుస్తామనీ, చెరకు పండించే రైతులకు 15 రోజుల్లోనే బకాయిలు చెల్లించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, బీమా, పింఛను సదుపాయాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు. అలాగే, ఉద్యమంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నింటినీ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు చెప్పారు. చెరకు రైతులకు 15 రోజుల్లోనే బకాయిలు చెల్లించేందుకు అవసరమైతే రైతుల రివాల్వింగ్‌‌ ఫండ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2017లో భాజపా మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారా? అని ప్రశ్నించారు. లఖింపూర్‌ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యాలకు పాల్పడిన భాజపాను ఓడించేందుకు ‘అన్న సంకల్పం’ చేస్తున్నామన్నారు. లఖింపూర్‌లో రైతుల బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ భాజపాను ఓడించేందుకు ప్రతి రైతు, సాధారణ ఓటరు సంకల్పం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు, అఖిలేశ్‌ హామీలపై భాజపా స్పందించింది. చేతుల్లో తుపాకులు పట్టుకొని తిరిగేవారు రైతుల శ్రేయోభిలాషులుగా నటిస్తున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో రాత్రిపూట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు హడలిపోయేవారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని