విజయసాయిరెడ్డికి అక్కడేం పని?: బచ్చుల

శాసనమండలిలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రసారాలు నిలివేశారని తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.

Updated : 23 Jan 2020 17:18 IST

మంగళగిరి: శాసనమండలిలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రసారాలు నిలివేశారని తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతి కోసం మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారని బచ్చుల అర్జునుడు అన్నారు. నిండుసభలో మండలి ఛైర్మన్‌కు మంత్రులు నరకయాతన చూపించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన షరీఫ్‌కు తెలుగుజాతి అంతా సెల్యూట్‌ చేస్తోందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఛైర్మన్‌ గదిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని అర్జునుడు విమర్శించారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే..: దీపక్‌రెడ్డి

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము పోరాటం చేస్తున్నామని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చెప్పారు. మండలిలో ఏంజరుగుతుందో బయటకు తెలియకుండా చేశారని ఆరోపించారు. తెదేపా సభ్యులందరిపైనా వైకాపా సభ్యులు, మంత్రులు దుర్భాషలాడారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నడుచుకున్నారన్నారు.

అన్నీ చట్ట ప్రకారమే: అశోక్‌బాబు

మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని నిర్ణయాలూ చట్ట ప్రకారమే జరుగుతాయని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ మంత్రి బొత్స మాట్లాడుతున్నారని, తొలుత ఆయన చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. వైకాపాకు అధికారం ఆ చట్టం ద్వారానే సంక్రమించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియనీయలేదని అశోక్‌బాబు ఆక్షేపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని