బెంగాల్‌లో ‘అల్‌ఖైదా’ విస్తరిస్తోంది: గవర్నర్‌

పశ్చిమబెంగాల్‌లో శాంతి భద్రతలకు ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం దిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Published : 10 Jan 2021 01:35 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శాంతి భద్రతలకు ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం దిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. బెంగాల్‌లో శాంతి భద్రతల విషయమై గవర్నర్‌ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై గత కొద్ది నెలలుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. 

‘రాష్ట్రంలో భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఉగ్ర సంస్థ అల్‌ఖైదా నెట్‌వర్క్‌ విస్తరించడంతో పాటు అక్రమ బాంబుల తయారీ కార్యకలాపాలు సైతం ప్రబలంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తోందనే విషయం తెలియడం లేదు. రాష్ట్రంలోని పోలీసులు రాజకీయ వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి. బెంగాల్‌కు 2021 శాసనసభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు వారికిది మంచి అవకాశం’ అని గవర్నర్‌ అన్నారు.

‘ఈ దేశానికే చెందిన భరతమాత బిడ్డలు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా బెంగాల్‌కు వస్తే వారిని ఔట్‌సైడర్స్‌ అని పిలవడం బాధిస్తోంది. రాష్ట్రంలో 2018 పంచాయతీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేశాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో హింసాకాండకు తావు లేకుండా ప్రతిఒక్కరూ కలిసి పనిచేయాలి’ అని ధన్‌కర్‌ విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భాజపా, టీఎంసీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. 

ఇదీ చదవండి..

మనటీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని