UP Election 2022: నిన్న కోడలు.. నేడు తోడల్లుడు.. నేతాజీకిమరో షాక్‌!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) దగ్గరపడుతున్న వేళ పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి. నిన్నటికి నిన్న సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)కి గట్టి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం

Published : 20 Jan 2022 13:44 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి. నిన్నటికి నిన్న సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)కి గట్టి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam Singh Yadav) చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ (Aparna Yadav) భాజపాలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ములాయం తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్‌ గుప్తా (Pramod Gupta) కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. గురువారం భాజపా సీనియర్‌ నేతల సమక్షంలో ప్రమోద్‌ గుప్తా కమల దళంలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ మాజీ నాయకురాలు ప్రియాంక మౌర్య కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ప్రమోద్‌ గుప్తా మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘మాఫియా, నేరస్థులను ఎస్పీలో చేర్చుకుంటున్నారు. అంతేగాక, పార్టీ వ్యవస్థాపకుడైన నేతాజీ (ములాయం సింగ్‌ యాదవ్‌) పార్టీలో ఖైదీగా మారిపోయారు. ఆయన, శివపాల్‌ యాదవ్‌ పట్ల అఖిలేష్‌ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక అలాంటి పార్టీలో ఉండటం అనవసరం అనిపించింది. అందుకే భాజపాలో చేరుతున్నా’’ అని చెప్పుకొచ్చారు.

ములాయం సతీమణి సాధనా గుప్తా సోదరి భర్తే ప్రమోద్‌ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేష్‌కు, ఆయన బాబాయి శివపాల్ యాదవ్‌కు మధ్య విబేధాలొచ్చాయి. దీంతో శివపాల్‌ ఎస్పీ నుంచి బయటకొచ్చి ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అదే సమయంలో ప్రమోద్‌ గుప్తా కూడా ఎస్పీని వీడి పీఎస్పీ గూటికి చేరుకున్నారు.

ఇటీవల శివపాల్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ మళ్లీ ఒక్కటైన విషయం తెలిసిందే. దీనిపై శివపాల్‌ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రమోద్‌ యాదవ్‌ భాజపాలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో మరింత మంది శివపాల్‌ వర్గీయులు భాజపాలో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు సమాజ్‌వాదీ పార్టీని కలవరపెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా, ఎస్పీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  దీంతో వలసలు కీలకంగా మారాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని