సుప్రీం కోర్టుకు రాజస్థాన్‌ పంచాయితీ!

రాజస్థాన్‌ రాజకీయం మరో మలుపు తీసుకుంది. పైలట్‌ వర్గంపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీం కోర్టుకు......

Published : 22 Jul 2020 11:51 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. పైలట్‌ వర్గంపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీం కోర్టుకు వెళుతున్నట్లు స్పీకర్‌ సీపీ జోషి వెల్లడించారు. ‘రాజ్యాంగ సంక్షోభం’ తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

స్పీకర్‌ ఇచ్చిన నోటీసులపై సచిన్‌ పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని తొలుత ఆదేశించింది. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం వరకూ ఎలాంటి చర్యలూ వద్దని మరోసారి సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ జోషి  బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు ఇది వరకే వెల్లడించింది. దీనిపై ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అధికారం స్పీకర్‌కు ఉంది. అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది’’ అని స్పీకర్‌ పేర్కొన్నారు.

మరోవైపు కాలయాపన జరిగే కొద్దీ సచిన్‌ వర్గం బలం పెరిగే అవకాశం ఉందని సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గం భావిస్తోంది. అందుకే వీలైనంత తొందరగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండడం, కాలయాపన జరుగుతుండడం అశోక్‌ గహ్లోత్‌ వర్గాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుతుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని