Acharya: ముందుంది ‘ఆచార్య’ పండగ.. ఇంకో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయ్‌!

చిరంజీవి, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌ చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.

Updated : 02 Dec 2021 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌ చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవల ‘సిద్ధ సాగా’ పేరుతో రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అందులోని చివరి షాట్‌ (ఒక వైపు చిరుతలు.. మరోవైపు చిరంజీవి, రామ్‌ చరణ్‌ కనిపించిన సన్నివేశం) సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ సీన్‌, సినిమా గురించి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

* టీజర్‌తోనే ‘ఆచార్య’ సినిమాపై అంచనాలు పెంచేశారు? ఆ ఆలోచన ఎలా వచ్చింది?

కొరటాల శివ: ఇది ధర్మం చుట్టూ తిరిగే కథ. ధర్మానికి ప్రతిరూపం సిద్ధ (రామ్‌ చరణ్‌ పాత్ర). కథని, పాత్రను ప్రేక్షకుల్లోకి  తీసుకెళ్లేందుకు శాంతి శ్లోకంతో టీజర్‌ను ప్రారంభించాలనుకున్నా. నా ఆలోచనను సంగీత దర్శకుడు మణిశర్మతో పంచుకోగానే ‘చాలా బాగుంటుంది. దానితోనే మొదలుపెట్టు’ అని అన్నారు. అలా ‘సహనాభవతు’ శ్లోకంతో సిద్ధ టీజర్‌ను తీర్చిదిద్దాం. సిద్ధ పాత్రను పరిచయం చేసి విజువల్‌ ట్రీట్‌ కోసం చివరి షాట్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికే సరిగ్గా సరిపోయింది. అదృష్టవశాత్తూ అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉండటంతో ఆ షాట్‌ను అందించగలిగా. దాన్ని చిత్రీకరించేటప్పుడు దర్శకుడిగా కాకుండా ఓ అభిమానిగా ఎంతో ఆనందించా.

* సాధారణంగా ఆచార్య దేవోభవ అని వింటుంటాం. ఆచార్య రక్షోభవ గురించి మీ మాటల్లో..

కొరటాల శివ: ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ఆచార్య ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఆచార్యను మనం దైవమని నమ్మితే వారే మనల్ని రక్షిస్తారు. ఆ ఆలోచనతోనే ఈ కథను రాసుకున్నా. అందుకే టీజర్‌లో ఆచార్య దేవోభవతోపాటు ఆచార్య రక్షోభవ అని వినిపిస్తుంది. ఓ అభిమానిగా చిరంజీవిగారిని తెరపై ఎలా చూడాలనుకున్నానో అలా చూపించే ప్రయత్నం చేశా. ఈ చిత్రం ఆయన అభిమానులే కాదు సినీ ప్రియులందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

* కథ పూర్తయ్యాక హీరోని ఎంపిక చేసుకుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాస్తుంటారా?

కొరటాల శివ: ముందుగా కాన్సెప్ట్‌ని సిద్ధం చేసుకుని దానికి న్యాయం చేయగలిగే నటుడ్ని ఎంపిక చేసుకుంటా. తర్వాత వారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథను పూర్తి చేస్తా. అలా అని మరీ ఎక్కువగా కమర్షియల్‌ హంగులు జొప్పించను. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. ‘ఆచార్య’ విషయంలోనూ అంతే. చిరంజీవిగారికి ఈ కథకు సంబంధించి ఓ లైన్‌ వినిపించా. విన్న వెంటనే ఓకే చెప్పారు. తన పాత్ర గురించి చెప్పగానే రామ్‌ చరణ్‌ కూడా వెంటనే నటిస్తా అన్నాడు. ఈ సినిమాకు రామ్‌ చరణ్‌ బోనస్‌.

* ఇద్దరు అగ్ర హీరోల్ని డైరెక్ట్‌ చేయడం ఎలా అనిపించింది?

కొరటాల శివ: కథ రాసినప్పుడు ఏం అనిపించలేదు గానీ ఈ ఇద్దరు హీరోలు (చిరంజీవి, రామ్‌ చరణ్‌) ఒప్పుకున్న తర్వాత కాస్త టెన్షన్‌ పడ్డా. ‘ఇద్దరికీ న్యాయం చేయాలి. పూర్తిస్థాయి పాత్రల్లో వారిద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. భవిష్యత్‌లో చేస్తారో లేదో తెలియదు. మనం బాగా చూపించాలి’ అని ఒత్తిడికి గురయ్యేవాడ్ని. నా భయాన్ని గమనించిన చిరంజీవి, రామ్‌ చరణ్‌ ‘మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆచార్య, సిద్ధ పాత్రల్ని మాత్రమే మైండ్‌లో పెట్టుకోండి. చిరంజీవి, రామ్‌ చరణ్‌లని చూడకండి’ అని ధైర్యాన్నిచ్చారు. ఇద్దరూ కనిపించే కొన్ని సన్నివేశాల్ని మారేడుమిల్లి అడవుల్లో 15 రోజులు షూట్‌ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. వారిద్దరినీ చూసి నేనూ చిత్ర బృందమంతా మురిసిపోయేవాళ్లం.

* ‘ధర్మస్థలి’ గురించి వివరిస్తారా?

కొరటాల శివ: ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ సినిమా ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. అంతర్లీనంగా ఓ గుడి, ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఈ టెంపుల్‌ టౌన్‌కే ‘ధర్మస్థలి’ అని పేరు పెట్టాం. ఇలాంటి లొకేషన్‌ కోసం చాలాచోట్ల తిరిగాం. కానీ ఏదీ మాకు అనువైన ప్రదేశమనిపించలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిరంజీవిగారు ఓ సలహా ఇచ్చారు. హైదరాబాద్‌ నగర శివారులో తనకున్న ఖాళీ స్థలంలో ‘ధర్మస్థలి’ సెట్‌ను రూపొందించమన్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌, ఇతర టెక్నిషియన్ల వల్ల అద్భుతమైన దేవాలయం దర్శనమిచ్చింది. దాన్ని చూసిన చిరంజీవి ఆశ్చర్యపోయారు. సుమారు 70 శాతం చిత్రీకరణ ఆ సెట్‌లోనే పూర్తి చేశాం. ఇంతటి భారీ సెట్‌ ఈమధ్య కాలంలో ఏ సినిమాలోనూ కనిపించి ఉండదు.

* ఈ సినిమా నుంచి ఇంకా ఏ సర్‌ప్రైజ్‌లు రానున్నాయి?

కొరటాల శివ: రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లు త్వరలోనే వస్తాయి. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ పాట, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి ఇప్పటి వరకూ ఫుల్‌ సాంగ్‌కు నృత్యం చేయలేదు. అది చూస్తే అభిమానులకు పండగే.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని