srinu vaitla: మీమర్స్‌కి మళ్లీ కంటెంట్‌ ఇస్తా..‘ఆగడు’ ఫ్లాప్‌ నేర్పిన పాఠం అదే!

వెండితెర మీద విలక్షణ కామెడీతో ఆయన సృష్టించిన చేసిన ట్రెండ్‌ నా భూతోః నా భవిష్యతి. యాక్షన్‌కి కామెడీని జోడిస్తూ సరికొత్త పాత్రలను సృష్టిస్తూ క్రిస్పీ స్క్రీన్‌ప్లే, కామెడీతో ఆయన తీసిన సినిమాలు కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారాయి. చిన్న హీరో అయినా.. స్టార్‌ హీరో అయినా.. తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంటతో ప్రసెంట్‌

Published : 14 Nov 2021 01:12 IST

వెండితెరపై విలక్షణ హాస్యంతో ఆయన సృష్టించిన ట్రెండ్‌ నభూతో నభవిష్యతి. యాక్షన్‌కి కామెడీని జోడిస్తూ.. సరికొత్త పాత్రలను సృష్టిస్తూ క్రిస్పీ స్క్రీన్‌ప్లేతో ఆయన తీసిన సినిమాలు కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారాయి. చిన్న హీరో అయినా.. స్టార్‌ హీరో అయినా.. తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎన్నో సంచలన హిట్స్‌ను అందుకున్న స్టార్‌ డైరెక్టర్‌.. శ్రీను వైట్ల. ఆయన ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా మీ లైఫ్‌ ఎలా ఉంది?

శ్రీను వైట్ల: రెండు విధాలా ఫర్వాలేదు. ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చినా.. అల్టిమేట్‌గా డబ్బు సంపాదనే ముఖ్యం. ప్రస్తుతం అనుకున్న దానికన్నా చాలా సౌకర్యవంతంగానే ఉన్నా. నా వాళ్లను చూసుకోవడం వంటి బాధ్యతలన్నీ నెరవేర్చాను. చేయాల్సినవన్నీ చేశా. ఇక నేను ఎవరికీ జవాబుదారీ కాను. వృత్తిపరంగా మూడు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశాను. ఒక దాని తర్వాత మరొకటి తీసే ప్రయత్నం చేస్తున్నా.

మీ ‘డి అండ్‌ డి’ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది?

శ్రీను వైట్ల:  ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది. విష్ణు హీరో.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. మిగతా ఆర్టిస్టులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. 

‘ఢీ’ ఏ రేంజ్‌ ఉందో ‘డి అండ్‌ డి’ కూడా అదే రేంజ్‌లో ఉంటుందా?

శ్రీను వైట్ల: అదే ప్రయత్నం చేస్తున్నాం. నా నుంచి కామెడీ ఎక్కువగా కోరుకుంటారు. ఆద్యంతం నవ్వించడమే ఈ సినిమా ఉద్దేశం. ఆ విధంగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాం.

కందులపాలెం నుంచి ఏం అవుదామని వచ్చారు?

శ్రీను వైట్ల: చిన్నప్పట్నుంచి డైరెక్టర్‌ అవ్వాలనేదే గోల్‌. మా ఊరి పక్కనే కాలేజీ ఉన్నా.. కాకినాడలో అయితే ఎక్కువ థియేటర్లు ఉంటాయి.. రూమ్‌లో ఉంటూ సినిమాలు చూడొచ్చని అక్కడ ఇంటర్మీడియట్‌లో చేరా. ఆ సమయంలో డైరెక్టర్‌ మణిరత్నం, వంశీ సినిమాలంటే చాలా ఇష్టం. వారిని చూసి డైరెక్టర్‌ అవ్వాలనుకున్నాను. చిన్న వయసులోనే ఆ ఆలోచన వచ్చింది. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని.. ఫీజు పేరుతో డబ్బులు తీసుకొని సామర్లకోటలో బొకారో ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాను. 

తమిళ భాష రాదు.. చెన్నైలో దిగగానే ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు?

శ్రీను వైట్ల: అప్పుడు నా వయసు 18 ఏళ్లు. చెన్నైలో దిగే సమయానికి మధ్యాహ్నమైంది. ఆ రోజు చెన్నైలో బస్సులు స్ట్రైక్‌. నాకేమో తమిళ్‌ రాదు. పాండి బజార్‌ వెళ్లాలనేది మాత్రమే తెలుసు. ఎలా వెళ్లాలో తెలియక బ్యాగ్‌ పట్టుకొని అదే మాట అడుగుతూ.. నడిచి వెళ్లాను. అయితే, రైలులో ఒక సంఘటన జరిగింది. కాకినాడలో తెలిసిన వ్యక్తి నాతోపాటు విజయవాడ వరకు వచ్చాడు. నేను మద్రాసు వెళ్తున్నానని చెప్పడంతో తన సోదరుడు చెన్నైలో ఉంటాడని చెప్పాడు. దీంతో అతని అడ్రస్‌ తీసుకున్నా. పాండి బజార్‌లోని మలార్‌కుడి మ్యాన్షన్‌లో ఉంటాడని తెలుసుకొని నేరుగా అతడి వద్దకు వెళ్లా. అతడి దగ్గర రెండ్రోజులుండి.. ఆ తర్వాత అక్కడే మరో వ్యక్తి రూమ్‌లోకి చేరా. అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా.. వైజాగ్‌లో ఉండే డిస్ట్రిబ్యూటర్‌ ఎన్వీ రెడ్డి పరిచయమయ్యారు. ఆయన ద్వారా డైరెక్టర్‌ చలసాని రామారావు పరిచయమయ్యారు. ఆయన 1989లో బాలకృష్ణతో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు నేను అప్రెంటిస్‌గా చేరా. అలా నా కెరీర్‌ మొదలైంది. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత సాగర్‌, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశా. అక్కడితో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం ఆపేసి డైరెక్టర్‌ అయ్యాను. 

డైరెక్టర్‌గా నిరూపించుకోవాలని చెన్నైకి వచ్చిన మీకు.. ఒక మెస్‌లో తింటుండగా మీ అన్న ఎదురుపడ్డారట. అప్పుడు మీ స్పందనేంటి?

శ్రీను వైట్ల: షాక్‌.. ఊహించలేదసలు. ప్రాణానికి ప్రాణం సినిమా కోసం తలకోన వెళ్లాం. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసే సరికి మా నాన్న.. మా అన్న(పెద్దనాన్న కుమారుడు)ని పంపించాడు. ఆ విషయం నాకు తెలియదు. మేనకా మెస్‌లో అన్న భోజనం చేస్తుంటే.. అనిల్‌ సుంకర కలిసి విషయం తెలుసుకున్నాడు. అప్పటికి అతనితో నాకు పరిచయం లేదు. అనిల్‌ సుంకరకు హెల్పింగ్‌ నేచర్‌ ఎక్కువ. ఆయన కూడా నా కోసం వెతకడం మొదలుపెట్టాడు. నేను అవుట్‌డోర్‌ షూటింగ్‌ వెళ్లానని తెలుసుకొని.. నేను వచ్చే వరకు మా అన్నని తన రూమ్‌లో పెట్టుకున్నాడు. నేను షూటింగ్‌ నుంచి తిరిగొచ్చి.. మెస్‌లో భోజనం చేస్తుంటే ఎదురుగా.. అన్న, అనిల్‌ నిల్చున్నారు. అనిల్‌కి నా ప్యాషన్‌ అర్థమై.. అన్నకి సర్దిచెప్పాడు. ఆ తర్వాత నన్ను ఆయనుండే సుగంధి మ్యాన్షన్‌లోని రూమ్‌కి రమ్మనడంతో అక్కడికి షిఫ్ట్‌ అయ్యా. (మధ్యలో ఆలీ అందుకుని..నిజానికి మలార్‌కుడి, సుగంధి మ్యాన్షన్‌ కట్టింది.. సినిమావాళ్ల కోసమే. ఆ రోజుల్లో అక్కడికి వెళ్లి నిల్చుంటే.. అసిస్టెంట్‌ డైరెక్టర్లు, కెమెరా అసిస్టెంట్లు, అప్‌కమింగ్‌ ఆర్టిస్టులు 70-80 మంది కనిపించేవారట)

శ్రీను వైట్ల: అవును. అదో అందమైన అనుభవం. నేను ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే అక్కడికి వెళ్తుంటా.

డైరెక్టర్‌గా తొలి అవకాశం ఏ సినిమాకి వచ్చింది?

శ్రీను వైట్ల: 1997లోనే రాజశేఖర్‌ గారితో ‘అపరిచితుడు’ మొదలుపెట్టాం. సాంబిరెడ్డి అనే వ్యక్తి నా మిత్రుడి మిత్రుడు. అతడే నా ప్యాషన్‌ చూసి దర్శకుడిని చేద్దామనుకున్నారు. కథ చెప్పగానే నచ్చడంతో సినిమా స్టార్ట్‌ చేశాం. కానీ, అతడికి ఆర్థిక కష్టాలు రావడంతో సినిమా ఆగిపోయింది. చాలా బాధపడ్డా. మళ్లీ ఆ చిత్రం పట్టాలెక్కినా అనేక కారణాలతో పూర్తి అవట్లేదని వదిలేశాం. ఆ తర్వాత నేను సినిమా బాగా తీస్తున్నానని తెలిసి.. కొందరు నిర్మాతలు తక్కువ బడ్జెట్‌లో సినిమా చేద్దామని నా వద్దకు వచ్చారు. అప్పుడు రవితేజ హీరోగా ‘నీ కోసం’ తీశా. దాని బడ్జెట్‌ రూ. 38లక్షలు.. 28 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ఆ సినిమా నాగార్జున గారికి నచ్చి నాకు డైరెక్షన్‌ ఆఫర్‌ చేశారు. కథ కూడా చెప్పమన్నారు. ఈ విషయం తెలిసి మయూరి సుధాకర్‌ గారు కూడా నా సినిమా చూశారట. ఆయనకూ నచ్చడంతో రామోజీరావు గారికి చూపించారు. అప్పుడు రామోజీరావు గారు ఆ సినిమా కొని విడుదల చేశారు. అలా ఆ సినిమా బయటకొచ్చింది.. దానికి ఏడు నంది అవార్డులు వచ్చాయి. 

అది అయిన తర్వాతే ‘ఆనందం’కి అవకాశం ఇచ్చారా?

శ్రీను వైట్ల: ఆ సినిమా చూసిన రామోజీరావు గారు ‘సినిమా బాగా తీశారు. మన బ్యానర్‌లో కచ్చితంగా అవకాశం ఇస్తాం’ అన్నారు. మాట ప్రకారం ‘ఆనందం’ సినిమా ఇచ్చారు. అయితే, ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి నాకు వేరే కథ వచ్చింది. దానిపై చింతపల్లి మురళి గారితో కలిసి వర్క్‌ చేశాం. కానీ, అది వర్కవుట్‌ అవలేదు. అప్పుడు నా సొంత కథ ‘ఆనందం’ చెబితే రామోజీరావు గారు సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. ‘ఇక మీరు సినిమా స్టార్ట్‌ చేసుకోవచ్చు’ అన్నారు. ‘మంచి రోజు చూసి మొదలుపెడతాం సర్‌’ అని రామోజీరావు గారితో అన్నాను. అలా అనగానే ‘మీరు చెడ్డ రోజు చూసి మొదలుపెట్టండి. ఎందుకు ఆడదో చూద్దాం’ అన్నారాయన. నిజంగా ఇదే మాట అన్నారు. ఆయన ఇలాంటి వాటిని నమ్మరు. ఆయన అన్న మాట ప్రకారం ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.

డైరెక్టర్‌గా మీ డైరెక్షన్‌లో ఎన్ని సినిమాలు అయ్యాయి?వాటిలో ఎన్ని హిట్‌ అయ్యాయి?

శ్రీను వైట్ల:  17 సినిమాలు. హిట్‌లు నేను లెక్కపెట్టలేదు. కానీ, మ్యాగ్జిమమ్‌ హిట్‌ అయ్యాయి. కొన్ని యావరేజ్‌ ఉన్నాయి. కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. 

ఈ సినిమా కచ్చితంగా ప్రజలకు నచ్చుతుంది. నా కెరీర్‌లోనే పెద్ద హిట్‌ అవుతుందనుకున్న సినిమా విడుదలయ్యాక నిరాశపర్చిన సినిమా ఏది?

శ్రీను వైట్ల: అలా ఏ సినిమాకీ జరగలేదు. ఇది పెద్ద హిట్‌ అవుతుంది అనుకున్నవి అలాగే అయ్యాయి. కానీ, ప్లాప్‌ అవలేదు. నాకు కాస్త డౌటు కొట్టి లేదా అనేక కారణాల వల్ల సినిమాని పూర్తి చేయాల్సి వస్తే నేను మానసికంగా ముందుగానే సిద్ధమై ఉంటా. అమర్‌ అక్బర్‌ ఆంథోనీ చిత్రం ఒక ప్రయోగం. దాన్ని పరిమిత బడ్జెట్‌లో తీశాను. ఆ సినిమాని ఎలా చేయాలో అలాగే చేశాం. దాని ఫలితానికి నేను షాక్‌ అవలేదు. 

అమర్‌ అక్బర్‌ ఆంథోనీ విషయంలో శ్రీను వైట్ల ప్రొడక్షన్‌ కూడా చూసుకోవడంతో డైరెక్షన్‌ మీద దృష్టి పెట్టలేకపోయాడు అనే టాక్‌ ఉంది?

శ్రీను వైట్ల: అది నిజం కాదు. ఎందుకంటే.. ‘ఢీ’ సినిమా మొత్తం నా భుజాన మీద వేసుకొని తీశాను. నిర్మాతతో సహా అన్ని నేనే. మరి అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది కదా!. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’ సినిమా విషయంలో జరిగింది అది కాదు. ఏ సినిమా ఆడటానికైనా మూల కారణం కథ. ఆ కథ బాగా లేకపోతే ఎంత పెద్ద ప్రొడక్షన్‌ అయినా నష్టం పెరుగుతుంది తప్ప.. ఫలితం మారదు. నేను ఆ సినిమాని ఎంతలో చేశానో నాకు తెలుసు. అందుకే నిర్మాతలకు నన్ను నిందించే ఆస్కారం రాలేదు. మేమంతా పరిస్థితిని అర్థం చేసుకొని తీసిన సినిమా. అంతేగానీ.. ప్రొడక్షన్‌ నెత్తిన వేసుకోవడం వల్ల కాదు. ఆ మాటకొస్తే.. ‘దూకుడు’, ‘నమో వెంకటేశ’ సినిమా నిర్మాతలను నేనే పరిచయం చేశా. అప్పుడు ప్రొడక్షన్‌ అంతా నేనే చూసుకున్నా. అవన్నీ హిట్‌ అయ్యాయి కదా.

సినిమా ప్రొడక్షన్‌  భూజాన వేసుకోవడం విషయంలో ఒక సమాధానం చెప్తా. ఆ పని ఎందుకు చేస్తానంటే.. సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా నిర్మాతలు సేఫ్‌గా ఉండాలని ఆలోచిస్తా. తక్కువలో తీశాను.. నిర్మాతలు సంతోషమే కదా అని అనిపించుకోవాలని కోరుకుంటా. మనం ఏది కోరుకుంటామో అది ఈ ప్రపంచం ఇవ్వదు. నా సినిమాలు ఫ్లాప్‌ అయితే ఆ ప్రభావం నాపై పడింది కానీ.. నిర్మాతలపై పడనివ్వలేదు. కానీ, అది ఎవరూ ఒప్పుకోరు. అందుకే దేనిపైనా నేను వివరణ ఇవ్వను. వారి గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం పాడవుతుంది. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటూ సంతోషంగా ఉన్నా. సినిమాపై ప్యాషన్‌ నాకు ఎప్పటికీ ఉంటుంది. 

శ్రీను వైట్ల ద్వారా పరిచయమై.. పెద్ద పేరు సంపాదించిన వాళ్లే.. శ్రీనువైట్ల గురించి మీడియాలో ఎక్కువ మాట్లాడారు. ఆ టైంలో మీకు ఏం అనిపించింది?

శ్రీను వైట్ల: అవన్నీ నేను పట్టించుకోను. నా ప్యాషన్‌ సినిమా. సినిమాతోనే నా కనెక్షన్‌. ఎవరు ఏం అనుకున్నా నేను పట్టించుకోను. ఒకప్పుడు స్పందించేవాడిని. కానీ, ఇప్పుడు అవి నన్ను ప్రభావితం చేయవు. 

మీ తప్పు లేనప్పుడు మీ గురించి మాట్లాడుతుంటే.. మీరెందుకు వచ్చి మాట్లాడలేదు?

శ్రీను వైట్ల:  మాట్లాడటం వల్ల అభిప్రాయాలు మారుతాయని మొదట నేను నమ్మను. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నేను స్పందించను. ప్రకాశ్‌రాజ్‌తో జరిగిన ఓ సంఘటనలో నా టీం బలవంతం మేరకు స్పందించానంతే.

మీ సినిమాల్లో మందు కొట్టే సీన్‌ తప్పనిసరిగా ఒకటి ఉంటుంది. అది సెంటిమెంటా? ఆ సీన్‌ చేసేటప్పుడు సరదా ఉంటుందా?

శ్రీను వైట్ల: ఆనందం సినిమాతో స్టార్ట్‌ చేశాం. అది ఎలా స్టార్ట్‌ అయిందంటే.. అప్పుడు మేం ఉండే ఇంటి ఓనర్‌ మంచోడే కానీ.. మమల్ని ఇబ్బంది పెట్టేవాడు. ఎక్కువ జనాలు వస్తే పెనాల్టీ వేసేవాడు. నాకు కోపం ఉండేది. ఎప్పుడో అతడిని సెంటర్‌లో కూర్చోబెట్టాలని అనుకునేవాళ్లం. ఆ ఆలోచన నుంచి ఆ సీన్‌ చేశాం. అది బాగా వర్కవుట్‌ అయింది. ఆ సెంటిమెంట్‌తో అలా స్టార్ట్‌ అయింది. ఏ మందు సీన్‌ ఫెయిల్‌ అవలేదు. ‘వెంకీ’ సినిమాకి వచ్చే సరికి పీక్‌లోకి వెళ్లింది. ‘దూకుడు’లో అయితే మందు సీన్‌ లేదు. కచ్చితంగా మందుసీన్‌ కావాలని మహేశ్‌ బాబు అడిగారు. నేనేమో ‘బాబు మీరేమో నిజాయితీగల పోలీసు, తండ్రికోసం కష్టపడుతుంటారు ఇలాంటి క్యారెక్టర్‌తో మందుసీన్‌ కుదరదు’ అన్నాను. లేదండీ మీరేం చేస్తారో తెలియదు మందుసీన్‌ పెట్టాలి అని మహేశ్‌ బాబు అన్నారు. ఆయన ఏం అడగలేదు.. అదొక్కటే అడిగారు. దీంతో మందు స్మెల్‌ చూస్తే ఎక్కేస్తది అనే కాన్సెప్ట్‌తో ఆ సీన్‌ తీశాం. 

ఎప్పుడైనా ఆ ఓనర్‌ ఆ క్యారెక్టర్‌ నాదిలా ఉందే అని అన్నారా?

శ్రీను వైట్ల: అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన లేరు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. సేమ్‌ గెటప్‌ ఎమ్మెస్‌ నారాయణ గారికి వేశాం. 

బ్రహ్మానందం ప్రతి సినిమాలో హీరో తర్వాత హీరోగా కనిపిస్తారు. ఏ సినిమా నుంచి మీ ఇద్దరి కాంబినేషన్‌ మొదలైంది. 

శ్రీను వైట్ల: మొదటి సినిమా ‘ఆనందం’లోనే చేశారు. ఆ తర్వాత వెంకీ నుంచి మొదలైంది. అందులో బాగా వర్కవుట్‌ అవటంతో ‘అందరివాడు’లోనూ చేశారు. ‘ఢీ’లో ఆయన గతంలో చేసిన క్యారెక్టర్స్‌లా కాకుండా కొత్తగా డిజైన్‌ చేశాం. ‘ఢీ’లో చారి, ‘దుబాయ్‌ శీను’లో రామకృష్ణ, ‘రెడీ’లో మెక్‌డొనాల్డ్‌ మూర్తి, ‘కింగ్‌’లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ క్యారెక్టర్‌, ‘నమో వెంకటేశ’లో పారిస్‌ ప్రసాద్‌, ‘దూకుడు’లో పద్మశ్రీ, ‘బాద్‌షా’లో పద్మనాభ సింహ.. అలా కుదిరాయి.

ఓ మూవీలో బ్రహ్మనందంగారు మ్యూజిక్‌ డైరెక్టర్‌లా చేశారు కదా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌లు ఎవరూ హర్ట్‌ అవలేదా? 

శ్రీను వైట్ల: ఒకరిద్దరు అనుకున్నారు. చాలా మంది చక్రి అనుకునేవారు. అసలు ఆయనది ఆ క్యారెక్టర్‌ కాదు. మంచి వ్యక్తి. నా ‘ఢీ’ సినిమాకి కూడా చేశారు. అది చక్రిని ఉద్దేశించి చేసింది కాదు. నా మనసులో ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉంటే.. కనెక్ట్‌ అయింది మరొకరు. నేనొక మ్యూజిక్‌ డైరెక్టర్‌ వద్దకు రామజోగయ్యశాస్త్రిని తీసుకెళ్లి పరిచయం చేశా. ‘ఒరేయ్‌ శాస్త్రి’ అనేశాడు. అది నచ్చింది. మిగతావి ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌లో లేవు. రాము గారి ఓ సినిమాలో ఉంటుందా క్యారెక్టర్‌ దాన్ని నుంచి డిజైన్‌ చేశామంతే.

దూకుడు సినిమాలో ఎమ్మెస్‌ నారాయణ గారు చాలా క్యారెక్టర్లను అనుకరించారు. అది చూసి చాలా మంది హర్ట్‌ అయ్యారని విన్నాను. నిజమేనా?

శ్రీను వైట్ల: నాకైతే తెలియదు. నేను ఎవరినీ కించపర్చడానికి పెట్టింది కాదు. అవకాశాల కోసం డైరెక్టర్లకు షో రీల్స్‌ చూపిస్తుంటారు కదా. అలా ఇతనికి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లోని సీక్వెన్స్‌లు అయితే బాగుంటుదని చేశాం.

హీరోను ముందే అనుకొని కథ తయారు చేస్తారా? కథ తయారు చేసుకున్న తర్వాత హీరోను అనుకుంటారా?

శ్రీను వైట్ల: ఎక్కువగా హీరో అనుకున్న తర్వాతే కథ ఉంటుంది. ఆనందం వంటి తక్కువ సినిమాలకే కథ అనుకున్న తర్వాత హీరోను ఎంచుకున్నాం.

ఒక పెద్ద డైరెక్టర్‌ను క్లాప్‌ బోర్డు విషయంలో ఒకరు కంగారు పెట్టారట ఎవరాయన?

శ్రీను వైట్ల: వినయ్‌(వి.వి.వినాయక్‌). ‘అబ్బాయిగారు’ సినిమాకు నేను అసిస్టెంట్‌.. తను అప్రెంటిస్‌. నాతో ఇంకా క్లాప్‌ కొట్టిస్తున్నారేంటని భావించి.. వినయ్‌ను క్లాప్‌ కొట్టామని ఇచ్చా. ఓ రోజు ఈవీవీ గారు క్లాప్‌ అన్నారు. ఇటు చూస్తే నా పక్కన వినయ్‌ లేడు. దీంతో రెండు టేక్స్‌ క్లాప్‌ బోర్డు లేకుండానే షూట్‌ చేశారు. మూడో టేక్‌ సమయానికి వినయ్‌ దూరం నుంచి వస్తుండటం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి క్లాప్‌ బోర్డు తీసుకొని మూడో టేక్‌కి క్లాప్‌ కొట్టా.

‘ఢీ అండ్‌ ఢీ’ సొంత ప్రొడక్షనా? బయటదా?

శ్రీను వైట్ల: విష్ణు వాళ్లది.

ఇది కాకుండా ఇంకేమున్నాయి?

శ్రీను వైట్ల: ఇది కాకుండా రెండు స్క్రిప్ట్‌లు ఉన్నాయి. ముందు ‘ఢీ అండ్‌ ఢీ’ స్టార్ట్‌ అయిన తర్వాత వాటిని ప్రకటిస్తా.

రూప ఎక్కడ, ఎలా పరిచయం?

శ్రీను వైట్ల: రూప హైదరాబాద్‌లోనే పరిచయమైంది. మా ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో కలిశాం. ఆ తర్వాత నెంబర్లు మార్చుకున్నాం. మా ప్రేమను వాళ్లింట్లో ఒప్పుకున్నారు.. మా ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్‌లోనే వివాహం చేసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబాలు కలిసిపోయాయి. 

ఎంత మంది పిల్లలు?

శ్రీను వైట్ల: ముగ్గురు అమ్మాయిలు. ఫస్ట్‌ పాప ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌, రెండో కూతురు ఫస్ట్‌ ఇయర్‌. మూడోది ఏడో తరగతి చదువుతోంది.  

అప్పుడప్పుడు మీరు చేసిన సినిమాలు చూసి కామెంట్‌ చేస్తారా?

శ్రీను వైట్ల: వాళ్లు ఆడపిల్లలు కదా లవ్‌ స్టోరీస్‌ నచ్చుతుంటాయి. ఇప్పుడు తీస్తున్న కమర్షియల్‌ సినిమాలకన్నా ‘ఆనందం’, ‘సొంతం’ సినిమాలు ఎక్కువ ఇష్టం. అలాంటి సినిమాలు చేయమంటుంటారు.

హీరో తన మైండ్‌ గేమ్‌తో స్టోరీ నడిపించడం. నిజాలు తెలిసిన కమెడియన్‌ టెన్షన్‌ పడటం. ‘ఢీ’ నుంచి అన్నీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కదా..?

శ్రీను వైట్ల: స్టోరీలు వేరు. కానీ.. సారూప్యత కనిపిస్తుంటుంది. ‘ఢీ’ నుంచి ఒక ఫార్ములా సెట్‌ అయింది. నేను అదే ఫార్మాట్‌లో చాలా సినిమాలు చేశా. నాతో పాటు చాలా మంది దర్శకులు అలాంటి సినిమాలు చేశారు. దాన్ని నేను స్టార్ట్‌ చేశా కాబట్టి.. నా మీద ఎక్కువ నింద పడింది. అంతకుముందు వేరేలా ఉండేవి. ఆ ఫార్మాట్‌ నుంచి బయటకొచ్చి ఇంకో ఫార్మాట్‌లో ఎంటర్‌టైన్‌ చేయాలి. ఏం చేసినా, ఎలాంటి నేపథ్యం తీసుకున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పాలి. వచ్చే మూడు స్క్రిప్టులు అలాగే డిజైన్‌ చేశాం. ఆద్యంతం నవ్వించడమే ఉద్దేశం.

దర్శకత్వంలో నీ స్ఫూర్తి ఎవరు?

శ్రీను వైట్ల: మణిరత్నం

తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోతో నేను చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు?

శ్రీను వైట్ల: పవన్‌ కల్యాణ్‌తో చేస్తే బాగుండేది. ఆయనకు నేను సూట్‌ అవుతానని నా ఫీలింగ్‌. ఆయనతో పనిచేసే ఆఫర్‌ వచ్చింది కానీ, కుదర్లేదు. 

మీమ్స్‌ ఎక్కువగా మీ సినిమాల నుంచే వస్తుంటాయి. వాటిని చూస్తే ఎలా అనిపిస్తుంటుంది?

శ్రీను వైట్ల: చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటికీ యూత్‌ బాగా కనెక్ట్‌ అయి ఉన్నారు. మళ్లీ మీమర్స్‌కు కంటెంట్‌ ప్రొవైడ్‌ చేయాలనే ఉద్దేశం గట్టిగా ఉంది. ఈ సినిమా(ఢీ అండ్‌ ఢీ)లోనూ అది వస్తుందనిపిస్తుంది. 

‘అందరివాడు’ ఆశించిన విజయం సాధించలేకపోయింది కారణమేంటి?

శ్రీను వైట్ల: నాకు ఓ మార్క్‌ వచ్చేసింది. నేను రెడీమేడ్‌ స్టోరీలకు సూట్‌ కాను. ఓ కథకు నన్నొచ్చి డైరెక్షన్‌ చేయమంటే చేయలేను. ఆ కథ భూపతిరాజా గారిది. కథ అనేది నా టైమింగ్‌ తగ్గట్టు నేను తయారు చేసుకుంటా లేదా తయారు చేయించుకుంటా. 

అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు కదా? ఈ కథను పక్కను పెట్టి నా కథను వినండి అని చెప్పే సందర్భం రాలేదా?

శ్రీను వైట్ల: చిరంజీవి అంటే మెగా స్టార్‌. నేను అప్పుడప్పుడే వస్తున్న డైరెక్టర్‌ను. వారికి చెప్పేంత ఇది లేదు. ఆయన్ను డైరెక్ట్‌ చేస్తున్నాను.. అదే గొప్పగా ఫీల్‌ అయ్యా. ఆయన పెద్ద స్టార్‌ అవడం వల్లే చెప్పలేకపోయా. అదేమీ బ్యాడ్‌ అవలేదు.. కానీ, అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. 

మీ కెరీర్‌లో ‘ఆగడు’ సినిమా స్పీడ్‌ బ్రేకర్‌ వేసిందా? అనుకున్న దానికి రీచ్‌ అవలేదని బాధ ఉండిపోయిందా?

శ్రీను వైట్ల: ‘ఆగడు’ ఫలితానికి కారణం నేనే. ఫ్యామిలీస్‌, యూత్‌ నా ఆడియన్స్‌. నా సినిమాల్లో క్లాస్‌ ఉండాలి. నేను ఊర మాస్‌ చేసే డైరెక్టర్‌ను కాదు. దూకుడులో మాస్‌ యాంగిల్స్‌లో కూడా మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ సంతృప్తి చెందారు. దీంతో వాళ్లు మహేశ్‌ బాబుతో మాస్‌ సినిమా చేయాలన్నారు. ఆ సమయంలో ‘టైగర్‌ జిందా హై’ సినిమా వచ్చింది. ఆ స్టైల్‌లో ‘దూకుడు’ని మించి చేయాలని ఓ ఆలోచనతో బ్యాంకాక్‌ నుంచే ఫోన్‌ చేసి చెప్పా. మహేశ్‌కు కూడా నచ్చింది. ఇదే చేద్దామన్నారు. అయితే, నిర్మాతలకు వేరే సినిమా వల్ల పెద్ద దెబ్బ పడింది. దీంతో నిర్మాతల కోసం నా ఆలోచనను పక్కన పెట్టి.. గ్రామీణ నేపథ్యంలో చేద్దామనుకున్నాం. మహేశ్‌లోని సామర్థ్యమంతా బయటకు తీయాలని విపరీతమైన డైలాగులు రాసి తీశాం. అంతా మాస్‌ మా ఇద్దరికీ సూట్‌ అవలేదు. అంచనాలు అందుకోలేక ఆ సినిమా నిరాశపర్చింది. ఇందులో నేను నేర్చుకున్నది ఏమిటంటే.. స్వార్థంగా ఉండాలి. ఇక నుంచి సినిమా ఆడాలనే ప్రయత్నం చేయాలి. బడ్జెట్‌ నియంత్రణ గురించి ఆలోచించొద్దు.

‘దూకుడు’, ‘ఆగడు’ సినిమాలకు మహేశ్‌ స్పందన ఏంటి?

శ్రీను వైట్ల: ‘దూకుడు’ ఫలితానికి చాలా ఆనందపడ్డారు. ఒక వారం రోజులు కలిసే ఉన్నాం. బాగా ఎంజాయ్‌ చేశాం. ‘ఆగడు’కి కూడా విడుదలకు వారం ముందు వరకు మేమంతా మంచి హిట్‌ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. విడుదల తర్వాత కూడా మహేశ్‌ నన్ను నిందించలేదు. నా బర్త్‌డేని కూడా తనే సెలబ్రేట్‌ చేశారు. మేం ఎక్కువ నమ్మిన సినిమా. కానీ అది ఫెయిల్‌ అవడంతో నేను, మహేశ్‌ ఇద్దరం బాధపడ్డాం

భవిష్యత్తులో మహేశ్‌తో సినిమా ఊహించొచ్చా?

శ్రీను వైట్ల: ప్రస్తుతం మూడు స్క్రిప్టుల గురించే ఆలోచిస్తున్నా. అవి నా స్టైల్‌లో ఎంతో హాస్యభరితమైన స్క్రిప్టులు. వీటిని మహేశ్‌బాబుని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినవి కావు. ఈ మూడు సినిమాలు పూర్తయి.. నేను అనుకున్న ఫలితాలు వస్తే.. కచ్చితంగా మహేశ్‌బాబుతో సినిమా చేయడానికి నా దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అందులో ఒకటి ఎంచుకొని ఆయనతో పెద్ద సినిమా చేయాలని ఉంది. 

‘ఆనందం’ 20 ఏళ్లు సందర్భంగా ఈటీవీకి, మన ఛైర్మన్‌ రామోజీరావు గారికి, మీకు అభినందనలు..

శ్రీను వైట్ల: నేను చెప్పాలి. రామోజీరావు గారు ‘ఆనందం’ అనే సినిమా ఇచ్చి ఉండకపోతే ఆలోచించడం కూడా కష్టం. నేను, నా కుటుంబం ఈ రోజు ఇలా బాగుందంటే.. రామోజీరావు గారు ‘ఆనందం’ ఇవ్వడం వల్ల జరిగింది.

ఈ షో సందర్భంగా ఎవరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు?

శ్రీను వైట్ల: రామోజీరావు గారికే.. నా తొలి సినిమా ఆయనే విడుదల చేశారు. ఆయన లేకపోతే సినిమా విడుదలయ్యేది కాదు. ఆ తర్వాత ‘ఆనందం’ అవకాశం ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాట. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.

‘ఆనందం’ సినిమాకి మొదటి నుంచి ఆకాశ్‌, రేఖను అనుకున్నారా? 

శ్రీను వైట్ల: లేదు. మొదట ఉదయ్ కిరణ్‌ను అనుకున్నాం. ఉదయ్‌ కిరణ్‌, రేఖతో టెస్ట్‌ షూట్‌ కూడా చేశాం. ఆ తర్వాత డేట్స్‌తో ఇబ్బంది వచ్చి.. సెకండ్‌ క్యారెక్టర్‌గా అనుకున్న ఆకాశ్‌ను మెయిన్‌ హీరోగా పెట్టి.. వెంకట్‌ను అలా పెట్టాం.

దేవీ శ్రీ ప్రసాద్‌తో ఎన్ని సినిమాలు?

శ్రీను వైట్ల: దేవీ శ్రీ ప్రసాద్‌తో పది వరకు సినిమాలు చేశాం. నమో వెంకటేశ కూడా తనే. ఆ తర్వాత తమన్‌. ఆయనతో ఐదు సినిమాలు చేశాం.

మీకు అజిత్‌తో సినిమా చేసే ఆఫర్‌ వచ్చిందా? 

శ్రీను వైట్ల: అవును. ‘దూకుడు’ని తమిళ్‌లో రీమేక్‌ చేయమని అడిగారు. గోవాలో ఓ సారి అజిత్‌ను నాకు డైరెక్టర్‌ చక్రి తోలేటి పరిచయం చేశారు. ‘‘దూకుడు’ సినిమా చూశాను. చాలా బాగుంది.. అంత మంది ఆర్టిస్టులను డీల్‌ చేయడం కష్టం. మీరు చేస్తా అంటే నేను రీమేక్‌ చేస్తా’’అన్నారు. అప్పుడు నేను జూ.ఎన్టీఆర్‌తో బాద్‌షా చేస్తున్నా.  నాకు తమిళం అంతగా రాదు. సినిమా మొత్తం టైమింగ్‌లో ఉంటుంది అని చెప్తే.. ఆలోచించుకొని చెప్పండి అన్నారు. ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన అక్కడ పెద్ద స్టార్‌ కదా.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌గారితో సినిమాలు చేశావ్‌? బాలకృష్ణతో ఎందుకు చేయలేదు?

శ్రీను వైట్ల: అది కుదర్లేదు. కథ చెప్పలేదు.. కానీ, చాలా సార్లు కలిశాం. ఆయన్ను అందరూ ఒకేలా చూపిస్తున్నారు.. అది ఉంటూనే కొంచెం ఎంటర్‌టైనింగ్‌లా చేయాలని ప్రయత్నం చేశాను. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే ఆస్కారం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని