గుడ్‌బై 2020.. పార్టీకి వేళాయరా..!

2020.. ఎన్నో ఆనందోత్సాహాలతో ప్రారంభమైన ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ఎంతో కఠినంగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు....

Published : 31 Dec 2020 08:04 IST

ప్రియమైనవారితో తారలు టేకాఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020.. ఎన్నో ఆనందోత్సాహాలతో ప్రారంభమైన ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ఎంతో కఠినంగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. కాగా, మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుండడంతో పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తమ ప్రియమైన వారితో కలిసి హాలీడేను ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తమ కుటుంబసభ్యులతో కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం కోసం బ్యూటిఫుల్‌ డెస్టినేషన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో కొంతమంది తారలు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ల వద్ద దర్శనమిస్తున్నారు.

మనువుతో ఒక్కటైన చోటికే..

సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే సామ్‌-చై 2021కు ఆహ్వానం పలికేందుకు బెస్ట్‌ ప్లేస్‌గా గోవాను ఎంచుకున్నారు. దీంతో ఈ జంట తాజాగా గోవాకు పయనమయ్యింది. 2017లో చై-సామ్‌ల వెడ్డింగ్‌ గోవాలోనే జరిగిన విషయం తెలిసిందే. దీంతో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ జంట పోస్ట్‌ చేసే ఫొటోల కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోవా నుంచి వచ్చాక సామ్‌.. ‘సామ్‌జామ్‌’,  ‘కాతువక్కుల రెండు కాదల్‌’, ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ చిత్రీకరణల్లో బిజీ కానున్నారు. చైతన్య సైతం ‘లవ్‌స్టోరీ’ షూట్‌లో భాగం కానున్నారు.


పింక్‌సిటీకి బాలీవుడ్‌ ప్రేమజంట..

బాలీవుడ్‌ ప్రేమజంట రణ్‌బీర్‌-ఆలియాభట్‌ కొత్త సంవత్సర వేడుకల కోసం పింక్‌సిటీగా పేరుపొందిన జైపూర్‌ను ఎంచుకున్నారు. రణ్‌బీర్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆలియా ఈ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ జంట తాజాగా జైపూర్‌ చేరుకుంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న నీతూకపూర్‌(రణ్‌బీర్‌ తల్లి) వేడుకల్లో పాల్గొంటున్నారు. వెకేషన్‌ నుంచి రాగానే.. ఆలియా-రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’ షూట్‌తో బిజీ కావొచ్చు అని బీటౌన్‌ వర్గాలు అనుకుంటున్నాయి.


దీప్‌వీర్‌ కూడా అక్కడికే..

బాలీవుడ్‌లో లవ్లీ కపుల్‌గా పేరుపొందిన మరో జంట దీపికాపదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌. 2020కి ముగింపు పలికేందుకు తాజాగా ఈ జంట జైపూర్‌కు వెళ్లారు. రణ్‌బీర్‌కపూర్‌-ఆలియా జంటతో కలిసి దీప్‌-వీర్‌ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. మరోవైపు దీపికా-రణ్‌వీర్‌ కలిసి నటించిన ‘83’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


మాల్దీవులకు మరో ప్రేమజంట..

బాలీవుడ్‌ నటుడు సిద్దార్థ్‌ మల్హోత్ర, నటి కియారా అడ్వాణీ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట న్యూఇయర్‌ వేడుకల కోసం మాల్దీవులను పర్‌ఫెక్ట్‌ ప్లేస్‌గా ఎంచుకుంది. ఈ మేరకు తాజాగా వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కలిసి దర్శనమిచ్చారు.


మరోసారి మాల్దీవులకే ఓటేసిన టైగర్‌-దిశా

2021కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే టైగర్‌ ష్రాఫ్‌, దిశాపటానీ మాల్దీవులకు వెళ్లారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చిన ఈ జంట కొత్త సంవత్సర వేడుకలకు డెస్టినేషన్‌గా మరోసారి అదే ప్రాంతానికి ఓటేశారు. వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సైతం ఈ జంట నెట్టింట్లో పోస్ట్‌ చేస్తుంది.


అనన్య-ఇషాన్‌ కూడా..

బాలీవుడ్‌ నటి అనన్యపాండే.. నటుడు ఇషాన్‌ ఖత్తర్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి 2020కు గుడ్‌బై చెప్పేందుకు మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ బుధవారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వెకేషన్‌ నుంచి వచ్చాక అనన్య.. ‘ఫైటర్‌’ షూట్‌లో పాల్గొంటారని సమాచారం.


సాగరతీరంలో మరో జంట

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్-నటి మలైకా అరోడా గత కొన్నిరోజులుగా గోవాలో హాలీడేను ఎంజాయ్‌ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లిన ఈ జంట వెకేషన్‌లో దిగిన ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అయితే వీరితోపాటు ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌తో సైతం గోవాలోనే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోనున్నారు.

ఇవీ చదవండి

ఒకే ఒక్క విజయం

రామోజీరావు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు: మయూరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని