UP: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూతోపాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు.

Updated : 11 Jul 2021 19:54 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు యూపీ ఏడీజీ(లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ ముష్కరులను మసీరుద్దీన్‌, మిన్హాజ్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడులు చేయడంలో వారిద్దరూ శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. వారి స్థావరాల నుంచి రెండు ప్రెషర్‌ కుక్కర్‌ బాంబులు, ఆయుధాలు, ఓ డిటొనేటర్‌, 6-7 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు అందిన సమాచారం ఆధారంగా కాకోరీ ప్రాంతంలో నిఘాపెట్టి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్టు చెప్పారు. వారి సహచరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

అల్‌ఖైదా యూపీ విభాగానికి ఉమర్‌ హల్మింది నేతృత్వం వహిస్తున్నట్లు ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అతడు పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో క్వెట్టా,  పెషావర్‌ లాంటి ప్రదేశాల్లో తన ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు వివరించారు. అతడు లఖ్‌నవూకు చెందిన పలువురు యువకులకు ఉగ్రవాదం వైపు ప్రేరేపించి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసిన వారిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లఖ్‌నవూలో ఓ భాజపా ఎంపీ సహా మరికొందరు సీనియర్‌ నాయకులను వారు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

ముగ్గురు జేఎమ్‌బీ ఉగ్రవాదుల అరెస్టు

జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్(జేఎమ్‌బీ) ఉగ్రముఠా సభ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు ముష్కరులను కోల్‌కతా ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్‌టీఎఫ్‌ కమిషనర్‌ వి సోలొమన్‌ నీసకుమార్‌ వివరాలు వెల్లడించారు. కోల్‌కతాలోని హర్‌దేవ్‌పుర్‌ ప్రాంతంలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై వచ్చిన సమాచారం ఆధారంగా వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి నుంచి జిహాదీ సాహిత్యం సహా ఉగ్రముఠాకు చెందిన ఇతర సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వారి ఫేస్‌బుక్‌ ఖాతాలను విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని