బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన రద్దు..!

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన రద్దైంది. కరోనావైరస్‌ తీవ్రత భారత్‌ అధికంగా ఉండటంతో ‘డౌనింగ్‌ స్ట్రీట్‌’ ఈ నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం అయితే వచ్చే వారం ఆయన పర్యటన జరగాల్సి ఉంది. ఈ పర్యటనలో

Published : 19 Apr 2021 16:13 IST

 కరోనావైరస్‌ వ్యాప్తి తీవ్రతే కారణం

ఇంటర్నెట్‌డెస్క్‌ : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన రద్దైంది. కరోనావైరస్‌ తీవ్రత భారత్‌లో అధికంగా ఉండటంతో ‘డౌనింగ్‌ స్ట్రీట్‌’ ఈ నిర్ణయం తీసుకొంది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం అయితే వచ్చే వారం ఆయన పర్యటన జరగాల్సి ఉంది. ఈ పర్యటనలో వాణిజ్య ఒప్పందం సహా పలు కీలక అంశాలను చర్చించాల్సి ఉంది. కానీ, భారత్‌లో పరిస్థితులు బాగోకపోవడంతో పర్యటన రద్దు చేసుకొన్నట్లు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం, భారత ప్రభుత్వం సంయుక్త ప్రకటన వెలువరించాయి.  

సోమవారం  డౌనింగ్‌ స్ట్రీట్‌ వెలువరించిన ప్రకటన ప్రకారం‘‘ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వచ్చేవారం భారత్‌లో పర్యటించలేరు. ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్‌ జాన్సన్‌లు ఈ నెల చివర్లో  ఇరు దేశాల భవిష్యత్తు భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చిస్తారు.  దీంతోపాటు తరచూ సంప్రదింపులు జరుపుతూనే.. ఈ  ఏడాది వ్యక్తిగతంగా భేటీ కావచ్చు’’ అని పేర్కొంది. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక ది గార్డియన్‌ వెల్లడించింది. 

బ్రెగ్జిట్‌ షాక్‌ నుంచి తేరుకొని బ్రిటన్‌ ఆర్థికంగా పుంజుకోవాలంటే బలమైన వ్యాపార భాగస్వాములు ఉండాలి. చైనా మార్కెట్‌ ఉన్నా- హాంకాంగ్‌ అంశం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. త్వరలో బ్రిటన్‌ ప్రకటించనున్న ఇండో-పసిఫిక్‌ వ్యూహం, స్వేచ్ఛా నౌకాయానానికి మద్దతిచ్చే భారత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అతి పెద్ద విపణిగా పేరున్న భారత్‌ యూకేలో రెండో అతి పెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. 2019-20లో 120 ప్రాజెక్టుల్లో భారత్‌ నుంచి పెట్టుబడులు సమకూరినట్లు తెలుస్తోంది. దాదాపు 850కి పైగా భారత కంపెనీలు అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాల వాణిజ్య బంధం బలపడటానికి ప్రధానుల భేటీ కీలకంగా మారనుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని