Omicron Timeline: ఒమిక్రాన్‌.. ఏ దేశంలోకి ఎప్పుడు?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ దావానలంలా వ్యాపిస్తుండటంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్‌ దాదాపు.....

Published : 03 Dec 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ దావానలంలా వ్యాపిస్తుండటంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్‌ దాదాపు 30 దేశాలకు పాకేసింది. డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఆందోళనకర వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఒమిక్రాన్‌ వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, తీవ్రమైన లక్షణాలేవీ లేవని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భయపెడుతున్న ఈ ఒమిక్రాన్‌ ఏయే దేశాలకు ఎప్పుడు పాకిందో ఓసారి చూస్తే..! 

* నవంబర్‌ 24న తొలిసారి రెండు దేశాల్లో B.1.1.529 (ఒమిక్రాన్‌) వేరియంట్‌ని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. దక్షిణాఫ్రికాలోని గుటాంగ్‌ ప్రావెన్స్‌తో పాటు బోట్స్‌వానా దేశంలో ఒకే రోజు ఈ కేసులు వెలుగుచూశాయి.

* నవంబర్‌ 26న దీన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఆ రోజు నాలుగు దేశాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నెదర్లాండ్‌, ఇజ్రాయెల్‌, హాంగ్‌కాంగ్‌, బెల్జియంలలో ఒమిక్రాన్‌ కేసులు గుర్తించారు.

* నవంబర్‌ 27న మరో ఐదు దేశాలకు ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందింది.  ఆస్ట్రేలియాతో పాటు చెక్‌ రిపబ్లిక్‌, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్‌.

* నవంబర్‌ 28న డెన్మార్క్‌, ఆస్ట్రియాలో వెలుగుచూడగా.. నవంబర్‌ 29న మరో నాలుగు దేశాలకు (కెనడా, స్వీడన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌) ఒమిక్రాన్‌ వ్యాపించింది. ఆ తర్వాత 30న ఫ్రాన్స్‌, జపాన్‌, పోర్చుగల్‌లలో కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.

* డిసెంబర్‌ 1న అత్యధికంగా తొమ్మిది దేశాలకు విస్తరించింది. బ్రెజిల్‌, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, నార్వే, ఐర్లాండ్‌, అమెరికా, ఘనా, యూఏఈ, నైజీరియాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.

తాజాగా డిసెంబర్‌ 2న భారత్‌లో రెండు కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని