Corona thrid wave: మృతుల్లో 60% మంది వారే.. తాజా అధ్యయనంలో వెల్లడి

మూడో వేవ్‌లో మృతిచెందినవారిలో 60శాతం మంది టీకాలు తీసుకోనివారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు అని మాక్స్‌ హెల్త్‌కేర్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది......

Published : 23 Jan 2022 01:59 IST

దిల్లీ: కరోనా మొదటి రెండు దశలతో పోలిస్తే.. థర్డ్‌వేవ్‌లో దేశంలో మృతుల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. మూడో వేవ్‌లో మృతిచెందినవారిలో 60శాతం మంది టీకాలు తీసుకోనివారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు అని మాక్స్‌ హెల్త్‌కేర్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరణించినవారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడినవారేనని తెలిపింది. వీరు కూడా కరోనాతోపాటు కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలతో బాధపడినవారేనని పేర్కొంది.

‘థర్డ్‌ వేవ్‌లో మా ఆసుపత్రుల్లో 82 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 60శాతం మంది మొదటి డోసు మాత్రమే తీసుకున్నవారు లేదా మొత్తానికే టీకా తీసుకోనివారు’ అని మాక్స్‌ హెల్త్‌కేర్‌ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. టీకాలు తీసుకోవడం కారణంగానే మూడో వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు వివరించింది. ఒమిక్రాన్‌ తీవ్రత, లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు పేర్కొంది. మాక్స్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా.సందీప్‌ బుద్ధిరాజా ఆధ్వర్యంలో.. కరోనా మొదలైనప్పటి నుంచి ఈ జనవరి 20వ తేదీ వరకు సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

కొవిడ్ మూడో దశలో 23.4శాతం మంది మాత్రమే ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందారని అధ్యయనం తెలిపింది. అదే రెండో వేవ్‌లో ప్రాణవాయువు వినియోగం 74శాతంగా, మొదటి దశలో 63 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. ఇందుకు పలు అంశాలను జోడించింది. ‘గతేడాది ఏప్రిల్‌(సెకండ్‌ వేవ్‌)లో దిల్లీలో 28వేల కేసులు నమోదవగా.. అన్ని ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. ఐసీయూ పడకలు దొరకడం గగనమైంది. కానీ గత వారం(థర్డ్‌ వేవ్‌)లో దిల్లీలో దాదాపు అన్నే కేసులు నమోదైనా.. ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య తక్కువే. ఆస్పత్రుల్లో పడకలకు ఎలాంటి కొరత ఏర్పడలేదు’ అని అధ్యయనం వివరించింది. మూడు దశల్లో ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య వరుసగా 20883, 12444, 1378 ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని