Talibans: భరోసా ఇస్తాం.. విమాన సర్వీసులు ప్రారంభించండి..!

అఫ్గానిస్థాన్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని తాలిబన్లు ప్రకటన చేశారు.

Published : 27 Sep 2021 01:49 IST

విమానయాన సంస్థలకు తాలిబన్ల విజ్ఞప్తి

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల గడుస్తునప్పటికీ అంతర్జాతీయ సమాజం నుంచి వారికి సరైన సహకారం లభించడం లేదనే చెప్పవచ్చు. చాలా దేశాలు అఫ్గాన్‌కు పౌర విమాన సేవలు పూర్తిగా నిలిపివేయగా.. పరిమితి సంఖ్యలో మాత్రమే అత్యవసర, సహాయ కార్యక్రమాలను అందించే విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని తాలిబన్లు ప్రకటన చేశారు. కాబుల్‌ విమానాశ్రయంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడ్డాయని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీసులు కొనసాగేలా విమానయాన సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.

‘కాబుల్‌ ఎయిర్‌పోర్టులో సమస్యలన్నీ చక్కబడ్డాయి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఎయిర్‌పోర్టు సిద్ధంగా ఉంది. విమాన సర్వీసులు సజావుగా సాగేలా సహకారం అందించేందుకు ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ (IEA) హామీ ఇచ్చింది’ అని తాలిబన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్‌ ఖహార్‌ బఖ్కీ ఓ ప్రకటన చేశారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడం వల్ల విదేశాల్లో ఎంతోమంది అఫ్గాన్లు చిక్కుకుపోయారని.. వీటికి తోడు చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అఫ్గాన్‌ వాసులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాల పౌరులను తరలించే ప్రక్రియ కూడా సవాల్‌గా మారింది. తమ దేశాన్ని వీడి పారిపోయేందుకు వేల మంది అఫ్గాన్‌ వాసులు కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడే పడిగాపులు కాశారు. అదే సమయంలో జంట పేలుళ్లతో కాబుల్‌ ఎయిర్‌పోర్టు అట్టుడుకిపోయింది. ఇలా వరుస పరిణామాలతో కాబుల్‌ విమానాశ్రయం మొత్తం దెబ్బతినడంతో విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. కేవలం పాకిస్థాన్‌ మాత్రమే పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతోంది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ఓవైపు అంతర్జాతీయ సమాజంతో సంబంధాలను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. మరోవైపు హింసాత్మక ధోరణినే అవలంభిస్తున్నారు. దీంతో తాలిబన్లతో సంబంధాలపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు