Delhi Air Crisis: దిల్లీలో పాఠశాలల మూసివేత.. వాయు కాలుష్యం ఎఫెక్ట్‌

దిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.....

Published : 14 Nov 2021 01:23 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వారం రోజులపాటు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. వాహనాలు తిరగడాన్ని నియంత్రించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ కార్యక్రమాలను సైతం నాలుగు రోజులపాటు నిలిపివేయాలని ఆదేశించారు.

దీపావళి పర్వదినం అనంతరం దిల్లీతోపాటు సమీపంలోని గుడ్‌గావ్‌, నొయిడా, ఘజియాబాద్‌ పట్టణాలు సైతం తీవ్ర వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కాలుష్యంపై శనివారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితి ఎంత దిగజారిందో మీరే చూడండి. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా దిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అయితే వాటిని దహనం చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు వెల్లడించింది.

అయితే ఈ సమాధానంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక అంచనాకొస్తున్నారు? ఈ కాలుష్య పరిస్థితులకు అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియజేయండి. రెండు రోజుల లాక్‌డౌన్ ఏమైనా విధిస్తారా?’ అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని