Delta Variant: రికవరీ + కొవిషీల్డ్‌ 2 డోసులతో సురక్షితం!

ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌పై రోగనిరోధక ప్రతిస్పందనలు అధికంగా కనిపిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనంలో తేలింది.

Published : 04 Aug 2021 22:38 IST

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: వైరస్‌ వ్యాప్తి రేటు, తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న డెల్టా వేరియంట్‌ ప్రపంచ దేశాలకు మరోముప్పుగా తయారైన విషయం తెలిసిందే. దీంతో ఈ రకంపై వ్యాక్సిన్‌ల ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌పై రోగనిరోధక ప్రతిస్పందనలు అధికంగా కనిపిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వ్యక్తులు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వారిలో డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) కలిసి సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టాయి. కొవిషీల్డ్‌ మొదటి, రెండు డోసులు తీసుకున్న తర్వాత వారిలో యాంటీబాడీల ప్రతిస్పందనలను (NAb)లను విశ్లేషించాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ బారినపడే (బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్) కేసులనూ పరీక్షించాయి. తద్వారా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న అనంతరం కొవిషీల్డ్‌ (ఒకటి లేదా రెండు డోసులు) టీకా తీసుకున్న వారిని సాధారణంగా కొవిషీల్డ్‌ తీసుకున్న వ్యక్తుల సమాచారంతో పోల్చి చూశారు. వైరస్‌ నుంచి రికవరీ అయిన వారిలోనే డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించే శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించాయి.

ఇదిలాఉంటే, డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఈ మధ్యే వెల్లడైంది. అంతేకాకుండా డెల్టా వేరియంట్‌నూ ఎదుర్కొంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక భారత్‌లో తొలుత వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌ ఇప్పటి వరకు 132 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే మహమ్మారిని అదుపు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇందుకోసం కరోనాను అంతం చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని