Rakesh Tikait: కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్​

పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా భరోసా కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రైతు నేత రాకేశ్​ టికాయిత్​ మరోమారు డిమాండ్​ చేశారు. రైతుల ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా.....

Published : 26 Nov 2021 22:22 IST

దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా భరోసా కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రైతు నేత రాకేశ్​ టికాయిత్​ మరోమారు డిమాండ్​ చేశారు. రైతుల ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు నివాళులర్పించినట్లు పేర్కొన్న టికాయిత్‌.. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోకి ప్రవేశించేందుకు మీకు అనుమతి లభించిందా? అని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు టికాయిత్​. ‘మాకు అనుమతి ఎందుకు? ఇది చైనానా? లేక కొరియానా? వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఎందుకు అనుమతి తీసుకోవాలి?’ అని స్పందించారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి త్వరలోనే రైతులతో చర్చిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్​ 27న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, ఆందోళనలు, డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టి ఓ పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ఆందోళనలు ముగిస్తామని పునరుద్ఘాటించారు.

సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం

కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సింఘూ సరిహద్దులోని  నిరసనల ప్రాంతానికి వందల ట్రాక్టర్లలో రైతులు తరలివచ్చారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలు, డీజే బాక్సులతో ట్రాక్టర్లను ముస్తాబు చేసి సరిహద్దులకు చేరుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేసిన రైతులు.. మిఠాయిలు పంచుకుని నృత్యాలు చేశారు. అన్నదాతల డ్యాన్సులు, ఆటపాటలతో సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని