Covid R Factor: ఆందోళన కలిగిస్తోన్న ఆర్‌ ఫ్యాక్టర్‌..!

దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్‌-ఫ్యాక్టర్‌ 1 దాటడం కలవరపెట్టే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 03 Aug 2021 15:24 IST

మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి

దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీగా వెలుగు చూస్తోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయి, పుణె నగరాలు మినహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్‌-ఫ్యాక్టర్‌ 1 దాటడం కలవరపెట్టే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచిస్తున్నారు.

మెట్రో నగరాల్లో వేగంగా..

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిచెందుతోన్న వేగాన్ని ఆర్‌-ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్షన్‌ రేట్‌) ద్వారా అంచనా వేయవచ్చు. ఇందులో భాగంగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (IMS) జులై చివరి నాటికి వైరస్‌ వ్యాప్తిని అంచనా వేసింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్‌ఫ్యాక్టర్‌ 1 కంటే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గుర్తించింది. దిల్లీలో ప్రస్తుతం 1.03కు చేరగా, చెన్నైలో 1.15, కోల్‌కతాలో 1, బెంగళూరులో 1కి చేరువైనట్లు ఐఎంస్‌ నిపుణులు అంచనా వేశారు. ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే తీరు కనిపించడం ఆందోళన కలిగించే విషయమని ఐఎంఎస్‌ పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా అభిప్రాయపడ్డారు. అయితే, ఇది మరో వేవ్‌కు కారణమవుతుందా అనడానికి ప్రస్తుత పరిస్థితులను మరికొన్ని రోజులు గమనించాల్సి ఉందన్నారు.

ఏపీ, తెలంగాణాల్లోనూ..

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు 1 దాటుతున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్, త్రిపుర మినహా ఈశాన్య రాష్ట్రాల్లో ముందునుంచీ ఈ సంఖ్య 1కి దగ్గరగా ఉంది. అంతేకాకుండా కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ వైరస్‌ వ్యాప్తి రేటు 1కి చేరువవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మే 16నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ ఆర్‌ఫ్యాక్టర్‌ రేటు 1కన్నా తక్కువే ఉండగా.. ప్రస్తుతం 1కి చేరువయ్యింది. మిజోరం (1.18), మణిపూర్‌ (1.07), మేఘాలయ (1.19), సిక్కిం (1.13)గా ఉన్నట్లు పేర్కొన్నారు. జులై 26 నాటికి అస్సాం, పశ్చిమబెంగాల్‌లో ఆర్‌ఫ్యాక్టర్‌ను 0.9గా అంచనా వేయగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 1.43కు చేరడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో మే వరకు ఆర్‌ఫ్యాక్టర్‌ 1కంటే తక్కువగానే ఉండగా, ప్రస్తుతం 1.07కు చేరుకుంది.

ఇక పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఒకవ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందనే విషయాన్ని రీ ప్రొడక్షన్‌ రేట్‌ ద్వారా అంచనా వేస్తారు. ఇది 1 కంటే తక్కువగా ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తి కాస్త అదుపులోనే ఉందని పరిగణిస్తారు. జులై 30నాటికి దేశంలో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి పెరగడంతో పాటు ఆర్‌ ఫ్యాక్టర్‌ రేటు 1 దాటినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ ఈమధ్యే అంచనా వేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదల రేటు 1 దాటుతున్నట్లు ఐఎంస్‌ కూడా పేర్కొంది. ఫిబ్రవరి 14-మే 7మధ్య కాలంలో జాతీయస్థాయిలో ఇది 1కంటే ఎక్కువగా ఉన్న ఇన్‌ఫెక్షన్‌ రేటు.. ఆ తర్వాత నుంచి జులై 27వరకు 1కంటే తక్కువగా ఉంది. తాజాగా మరోసారి క్రమంగా పెరుగుతోంది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 40వేల పాజిటివ్‌ కేసులు, 400 మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన కొవిడ్‌ బాధితుల సంఖ్య 4లక్షల 25వేలు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని