Vladimir Putin: డిసెంబర్‌ 6న.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ డిసెంబర్‌ 6న భారత్‌లో పర్యటించనున్నారు.

Published : 26 Nov 2021 23:34 IST

కీలక అంశాలపై చర్చించనున్న పుతిన్‌-మోదీ

దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ డిసెంబర్‌ 6న భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌-రష్యాల వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతిఏటా జరిగే వార్షిక సదస్సులో పుతిన్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య భేటీకి ముందే ఇరు దేశాల రెండు శాఖలకు చెందిన మంత్రులు సమావేశం కానున్నారు. భారత్‌, రష్యాకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇక భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరగగా.. ఇది 21వ సమావేశం. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరుగుతుంది. అయితే, గతేడాది ఈ సదస్సు భారత్‌లో జరగాల్సి ఉండగా..  కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డిసెంబర్‌ 6న భారత్‌కు రానున్నారు. ఇదిలాఉంటే, రష్యా నుంచి ఆధునిక ఏకే-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం ఈ మధ్యే కుదిరిన విషయం తెలిసిందే. సాంకేతికత రష్యాదే అయినప్పటికీ వీటిని భారత్‌లోనే తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని