India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి మహమ్మారి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 7 వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి పడిపోయాయి. సోమవారం 10,12,523 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,990 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 30 Nov 2021 12:17 IST

ఒమిక్రాన్ వేళ.. ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న ప్రభుత్వం

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 7 వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి పడిపోయాయి. సోమవారం 10,12,523 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,990 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. ఆ కేసులు సంఖ్య లక్ష మార్కుకు చేరువైంది. నిన్న ఒక్కరోజే 10,116 మంది కరోనా నుంచి బయటపడ్డారు. క్రియాశీల రేటు 0.29 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.35 శాతానికి పెరిగింది. 

గత ఏడాది ప్రారంభం నుంచి 3.45 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.40 కోట్ల మంది వైరస్‌ను జయించారు. 24 గంటల వ్యవధిలో 190 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,68,980కి చేరింది. నిన్న ఒక్కరోజే 78,80,545 మంది కరోనా టీకా వేయించుకున్నారు. నిన్నటివరకు 123 కోట్లకు పైగా  టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోనే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచానికి ఒమిక్రాన్ వేరియంట్ భయం పట్టుకుంది. దాని వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టత లేనప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ వేరియంట్‌ మరో ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే కేసులు తగ్గుతున్నా.. ప్రజలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని ప్రభుత్వాలు, అధికారులు అభ్యర్థిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని