India Corona: 9 నెలల కనిష్ఠానికి కొత్త కేసులు.. గణనీయంగా పెరిగిన రికవరీ రేటు 

దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల కనిష్ఠానికి చేరి.. 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు, క్రియాశీల రేటు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. 

Updated : 09 Nov 2021 15:55 IST

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల కనిష్ఠానికి చేరి.. 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా.. క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

సోమవారం 10,85,848 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,126 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గాయి. అలాగే కేరళ, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్.. కేసుల పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

గత ఏడాది ప్రారంభం నుంచి దేశంలో 3.43 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 11,982 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్ఠానికి చేరింది.  దాంతో క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.25 శాతానికి పెరిగింది. కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో మరణాల సంఖ్య భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 332 మరణాలు నమోదుకాగా.. అందులో 262 కేరళవే. ఇప్పటివరకు 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 59 లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 109 కోట్ల మార్కును దాటింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని