Reopening Schools: పాఠశాలలపై నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమే..!

కరోనా వైరస్ మహమ్మారి కారణంతో సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు తెరవకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.

Published : 08 Aug 2021 18:34 IST

పలు సూచనలు చేసిన పార్లమెంటరీ కమిటీ

దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంతో సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు తెరవకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాల సామాజిక స్థితులపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా ఇంటిపనుల్లో చిన్నారుల ప్రమేయాన్ని మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. అందుచేత పాఠశాలలు తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని సూచించింది.

‘ఏడాదికిపైగా పాఠశాలలు మూతపడడం చిన్నారుల శ్రేయస్సుపై.. ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను విస్మరించలేం. స్కూళ్లకు దూరంగా ఉంటూ.. పిల్లలు నాలుగు గోడలకే పరిమితం కావడం తల్లిదండ్రుల, చిన్నారుల మధ్య సంబంధంపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది’ అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఇవి కుటుంబాల సామాజిక స్థితిని ప్రభావం చేయడం, బాల్య వివాహాలకు దారితీయడంతో పాటు మహమ్మారికి ముందున్న అభ్యసన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తిరిగి తెరవడం అత్యంత అవసరమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.

విద్య, మహిళలు, చిన్నారులు, యువతతో పాటు క్రీడలకు సంబంధించి స్కూళ్ల మూసివేత, ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌, పరీక్షలు, పాఠశాలలు పునఃప్రారంభంపై వినయ్‌ పీ సహాస్రబుద్దే నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ తాజా నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. సంక్షోభ సమయంలో పరిస్థితుల తీవ్రతను విస్మరించకూడదన్న కమిటీ, పాఠశాలలను తిరిగి తెరవడానికి హేతుబద్ధమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

వ్యాక్సిన్‌ పొందడంతో సాధ్యమే..

టీచర్లు, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులకు వ్యాక్సిన్‌ అందించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా పాఠశాలలను తిరిగి ప్రారంభించవచ్చని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా రోజు తప్పించి రోజు లేదా రెండు షిఫ్టుల్లో తరగతులను నిర్వహించడం వల్ల భౌతిక దూరాన్ని పాటించడం వీలవుతుంది. ర్యాండమ్‌ పద్ధతిలో పిల్లలు, సిబ్బందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించడం, మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి జాగ్రత్తలతో తరగతులను తిరిగి ప్రారంభించే ఆస్కారం ఉంటుందని సిఫార్సు చేసింది. వీటికి తోడు ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవడం, వాటికి శిక్షణ కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం వంటి చర్యలనూ సూచించింది. ఆరోగ్య అధికారుల పర్యవేక్షణతో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయవచ్చని పేర్కొంది. పాఠశాలలను తిరిగి తెరవడంలో ఉత్తమ విధానాలు అనుసరిస్తోన్న వివిధ దేశాల చర్యలను పరిగణలోకి తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని