BJP Meet: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం!

మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. భారతీయ జనతా పార్టీ కార్యవర్గం కీలక సమావేశం ఏర్పాటు చేసింది.

Updated : 24 Sep 2022 15:38 IST

వ్యూహరచణ చేస్తోన్న కాషాయ పార్టీ3

దిల్లీ: మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా పాల్గొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నందుకు గానూ భాజపా కార్యకర్తలందరి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ సీనియర్‌ నేతలు సత్కరించారు.

భాజపా కార్యవర్గ సమావేశంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో కరోనా పరిస్థితులు ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ అరుణ్ సింగ్‌ వెల్లడించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతోన్న ఈ మేధోమథన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా హాజరయ్యారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా భాజపా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ అధినేతలు మాత్రం వర్చుల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. సమావేశం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని