Afghan Crisis: అఫ్గాన్‌ పరిణామాలతో అన్ని దేశాలకూ చిక్కులే..!

తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు కేవలం ఆ దేశానికే కాకుండా సరిహద్దు దేశాలకూ చిక్కులు కలిగించేవేనని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 10 Nov 2021 16:07 IST

ప్రాంతీయ దేశాల సమావేశంలో ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌

దిల్లీ: తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు కేవలం ఆ దేశానికే కాకుండా సరిహద్దు దేశాలకూ చిక్కులు కలిగించేవేనని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్‌ పరిస్థితులపై ప్రాంతీయ దేశాలు పరస్పర సహకారం, సమన్వయం, సంప్రదింపులతో ముందుకెళ్లాలని అభిప్రాయపడింది. అఫ్గాన్‌ సంక్షోభంపై దిల్లీలో జరుగుతోన్న ఎనిమిది దేశాల సమావేశంలో భారత్‌ ఈ విధంగా స్పందించింది.

‘అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై చర్చించేందుకు సమావేశమయ్యాం. ప్రస్తుతం అక్కడ నెలకొంటున్న పరిస్థితులను అన్ని దేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. తాజా పరిణామాలు కేవలం అఫ్గానిస్థాన్‌ ప్రజలకే కాకుండా ఈ ప్రాంతంలోని సరిహద్దు దేశాలపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు పూర్తి సమన్వయంతో సహకరించుకుంటూ ముందుకెళ్లాల్సిన సమయం ఇది’ అని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. భారత్‌ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశం లోప్రారంభోపన్యాసం చేసిన ఆయన.. అఫ్గాన్‌ పరిణామాలపై పొరుగు దేశాలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

అఫ్గాన్‌లో ఉగ్రవాదం, ఆ ఉగ్ర కార్యకలాపాల వల్ల ఇతర దేశాలపై పడే ప్రభావంపై చర్చించేందుకు 8 ప్రాంతీయ దేశాలతో భారత్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గాన్‌ వేదికగా ఉగ్రవాద ముప్పు, డ్రగ్స్‌ రవాణా వంటి వాటిని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మధ్య ఆసియాలోని కజఖ్‌స్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సహా రష్యా, ఇరాన్‌ల జాతీయ భద్రత సలహాదారులు హాజరయ్యారు. అయితే, ఈ భేటీకి చైనా, పాకిస్థాన్‌లను భారత్ ఆహ్వానించినప్పటికీ.. ఆ రెండు దేశాలు పలు కారణాలు చెబుతూ డుమ్మా కొట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని