పాత సామాను వ్యాపారి ఆస్తి రూ.1,740 కోట్లు!

నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేసిన వ్యక్తి వేల కోట్లకు అధిపతి కావడం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. బెంగళూరులోనే శ్రీమంతులైన రాజకీయ నాయకుల వరుసలో చేరిన ఆయన ఇప్పుడు

Updated : 25 Nov 2021 07:20 IST

 కలిసొచ్చిన కేజీఎఫ్‌లో వ్యాపారం

 నేడు కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి

యూసుఫ్‌ షరీఫ్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేసిన వ్యక్తి వేల కోట్లకు అధిపతి కావడం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. బెంగళూరులోనే శ్రీమంతులైన రాజకీయ నాయకుల వరుసలో చేరిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా... కర్ణాటక విధాన పరిషత్తు ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆయనే.. యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు. మంగళవారం నామినేషన్‌ పత్రాల దాఖలు సందర్భంగా తన వద్ద రూ.1,643 కోట్ల స్థిరాస్తి, రూ.97 కోట్ల చరాస్తి ఉందని వెల్లడించారు. యూసుఫ్‌ షరీఫ్‌ కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కేంద్రంగా చాలాకాలం పాత సామగ్రి వ్యాపారం చేశారు. ఆ సమయంలో కేజీఎఫ్‌లో పాత ట్యాంకులు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. ఇది అతనికి బాగా కలిసి వచ్చింది. అందుకే తన పేరూ ‘కేజీఎఫ్‌ బాబు’గా మారిపోయింది. ఆ తర్వాత తన నివాసాన్ని బెంగళూరుకు మార్చి.. వ్యాపారాన్ని విస్తరించి, స్థిరాస్తిలోకీ అడుగుపెట్టారు. మొత్తం 23 బ్యాంకు ఖాతాలున్న బాబుకు రూ.2.99 కోట్ల విలువైన 3 కార్లు, రూ.1.11 కోట్ల చేతి గడియారం, 4.5 కిలోల బంగారం, ఒక్కోటి రూ.లక్ష విలువ చేసే 4 చరవాణులు, మూడు చోట్ల రూ.48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ.1593 కోట్ల విలువైన చేసే 26 స్థలాలు, రూ.3 కోట్ల విలువైన ఇల్లు ఆస్తుల్లో భాగంగా ఉన్నాయి. రూ.58 కోట్ల రుణాలూ ఉన్నాయి. బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వద్ద రూ.77.15 లక్షలు, రెండో భార్య వద్ద రూ.30.37 లక్షలు, కుమార్తె వద్ద రూ.58.73 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని తన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ నుంచి రూ.2.01 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారును కొన్నేళ్ల కిందట ఆయన కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని