మనిషికి పంది కిడ్నీ.. విజయవంతంగా అవయవ మార్పిడి

అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయం లిఖించారు అమెరికా శాస్త్రవేత్తలు! పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి విజయవంతంగా అమర్చారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేయడం విశేషం.

Updated : 21 Oct 2021 10:22 IST

న్యూయార్క్‌: అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయం లిఖించారు అమెరికా శాస్త్రవేత్తలు! పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి విజయవంతంగా అమర్చారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేయడం విశేషం. అవయవాల కొరతను అధిగమించడంలో ఈ పరిశోధనను కీలక ముందడుగుగా భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని  ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు... మెదడు పనిచేయడం ఆగిపోయిన ఓ వ్యక్తిపై గతనెలలో అవయవ మార్పిడి ప్రయోగం చేపట్టారు. పంది మూత్రపిండాన్ని అతనికి అమర్చి, మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని శస్త్రచికిత్స నిర్వహించిన డా.రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు. నిజానికి పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలదు. దీంతో మనిషి రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్‌వైయూ శాస్త్రవేత్తలు... జన్యు సవరణలు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. దాని కణాల్లో చక్కెర స్థాయిలను తగ్గించి, మనిషి రోగ నిరోధక వ్యవస్థ తృణీకరించకుండా కొన్ని మార్పులు చేశారు. తర్వాత ఆ మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని