Afghan: తాలిబన్ల దుశ్చర్య.. జాతీయ క్రీడాకారిణి తల నరికి..

అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని తాలిబన్లు దారుణంగా హత్య చేశారు. ఆమె తల నరికి పాశవికంగా హతమార్చారు.....

Published : 20 Oct 2021 17:57 IST

కాబుల్‌: అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారు. నరమేధం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాలు, మహిళా అథ్లెట్లు మరికొందరిని లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారు. మహిళలను క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన తాలిబన్లు.. కొద్దిరోజుల క్రితమే అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని దారుణంగా హత్య చేశారు. ఆమె తల నరికి పాశవికంగా హతమార్చారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఉ ఉదంతాన్ని ఆ జట్టు కోచ్‌ తాజాగా వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అఫ్గాన్‌ అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ జట్టు కోచ్‌ సురాయా అఫ్జాలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ జట్టులోని క్రీడాకారిణి మహ్జాబిన్‌ హకీమిని తాలిబన్లు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని బెదిరించడంతో ఈ విషయాన్ని వారు వెల్లడించలేకపోయారని పేర్కొన్నారు. తాలిబన్ల ఆక్రమణల నేపథ్యంలో జట్టులోని ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశం విడిచి వెళ్లిపోయారని.. మిగతావారికి అది సాధ్యం కాలేదని తెలిపారు. హకీమి కూడా పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేదని గద్గద స్వరంతో మాట్లాడారు.

అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం కూలిపోయే ముందువరకు కాబుల్‌ మున్సిపాలిటీ వాలీబాల్‌ క్లబ్‌కు మహ్జాబిన్‌ హకీమి ప్రాతినిధ్యం వహించింది. ఉత్తమ ప్లేయర్‌గానూ గుర్తింపు సంపాదించింది. అయితే అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు మహిళా క్రీడాకారులపై దృష్టిసారించారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మహళా క్రీడాకారిణులను లక్ష్యంగా చేసుకొని వారిని కిరాతకంగా హతమారుస్తున్నారు. దీంతో అనేక మంది మహిళా అథ్లెట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తలదాచుకుంటున్నారు. మరికొందరు దేశం విడిచి పారిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని