Pm modi: అత్యంత ప్రభావశీల వ్యక్తిగా మోదీకి రెండో స్థానం.. సచిన్‌కూ ప్లేస్‌

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో 2021కుగానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండవ స్థానంలో నిలిచారు.....

Published : 09 Nov 2021 22:01 IST

దిల్లీ: ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్‌తో ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. మరో ఘనత సాధించింది. తాజాగా నిర్వహించిన మరో సర్వేలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విటర్‌లో 2021కు గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ద్వితీయ స్థానంలో నిలిచారు. వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్‌వాచ్‌’ తమ వార్షిక సర్వే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా గాయని ‘టేలర్‌ స్విఫ్ట్‌’ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడం విశేషం.

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు సైతం ఈ జాబితాలో చోటుదక్కింది. ప్రముఖ హాలీవుడ్‌ నటులు డ్వేన్‌ జాన్సన్, లియోనార్డో డికాప్రియో సహా అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను వెనక్కినెట్టి సచిన్‌ 35వ స్థానంలో నిలిచారు. దశాబ్దకాలంగా సచిన్‌ యునిసెఫ్‌ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, 2013లో ఆ సంస్థ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సచిన్‌ సేవలను బ్రాండ్‌వాచ్‌ కొనియాడింది. అణగారిన వర్గాల కోసం గళం విప్పుతూ గొప్పగా పని చేస్తున్నారని, నిర్దిష్టమైన లక్ష్యాల కోసం పని చేస్తున్నారని ప్రశంసించింది. సచిన్‌ నుంచి స్ఫూర్తి పొంది ఆయన అభిమానులు కూడా ఆ సేవలను కొనసాగిస్తున్నారని బ్రాండ్‌వాచ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని