పాక్‌ తెలివిగా ప్లాన్‌ చేసింది.. కానీ,

యాభై ఏళ్ల క్రితం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన లోంగేవాలా యుద్ధంలో మనల్ని ఓడించేందుకు దాయాది దేశం తెలివిగా ప్లాన్‌ చేసిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా అన్నారు.

Updated : 18 Feb 2021 18:01 IST

భారత వాయుసేనాధిపతి భదౌరియా

దిల్లీ: యాభై ఏళ్ల క్రితం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో లోంగేవాలా ప్రాంతంలో మనల్ని ఓడించేందుకు దాయాది దేశం తెలివిగా ప్లాన్‌ చేసిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా వెల్లడించారు. అయితే మన వాయుసేన శక్తిని పాక్‌ అంచనా వేయలేకపోయిందని తెలిపారు. రిటైర్డ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భరత్‌ కుమార్‌ రచించిన ‘ది ఎపిక్‌ బ్యాటిల్ ఆఫ్‌ లోంగేవాలా’ పుస్తకాన్ని భదౌరియా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘లోంగేవాలా యుద్ధం గురించి చాలా చెప్పాలి. యుద్ధం కోసం ఎంచుకున్న ప్రాంతం, మార్గం విషయంలో పాకిస్థాన్‌ సైన్యం అద్భుతమైన ప్లాన్‌ రచించింది. ఆ పథకం ఫలించి ఉంటే పశ్చిమఫ్రంట్‌లో యుద్ధ ఫలితం మారిపోయి ఉండేది. కానీ అక్కడే పాకిస్థాన్‌ ఓ విషయాన్ని మర్చిపోయినట్లు ఉంది. భారత వాయుసేన శక్తిని అంచనా వేయలేకపోయింది. జైసల్మేర్‌లో హంటర్‌ యుద్ధవిమానాలతో ఉన్న సగం స్క్వాడ్రాన్‌ మమ్మల్ని ఏం చేయగలదులే అని అతివిశ్వాసంతో ఉంది. బహుశా వారు చేసిన పొరబాటు అదేనేమో’’ అని భదౌరియా చెప్పుకొచ్చారు.

భారత వాయుసేన శక్తి సామర్థ్యాలేంటో లొంగేవాలా యుద్ధం నిరూపించిందని వాయుసేనాధిపతి అన్నారు. ఇలాంటి గొప్ప ఘటనలు పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్‌ స్వతంత్ర పోరాటంలో భాగంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1971లో యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ యుద్ధంలోనే రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో ఉన్న లోంగేవాలా పోస్ట్‌పై పాకిస్థాన్‌ బలగాలు దాడి చేశాయి. దాదాపు 2000 నుంచి 3000 మంది పాక్‌ సైనికులు 30 - 40 యుద్ధ ట్యాంకులతో దండెత్తి వచ్చారు. భారత్‌ వైపు కేవలం 120 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అయితే భారత వాయుసేనకు చెందిన 4 హంటర్‌ యుద్ధ విమానాలు భారత సేనకు అండగా రంగంలోకి దిగాయి. దీంతో భారత సైన్యం పైచేయి సాధించి యుద్ధంలో పాక్‌ను మట్టికరిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని