సెకండరీ ఇన్‌ఫెక్షన్లు సోకినవారిలో 56 శాతం మరణాలు!

కోవిడ్ నుంచి కోలుకుంటూ బాక్టీరియా, ఫంగస్‌ తదితర సెకండరీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడ్డ కోవిడ్‌ రోగుల్లో 56 శాతం మంది మృత్యువాత పడుతున్నారని  ఐసీఎంఆర్‌ చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది

Published : 29 May 2021 01:41 IST

దిల్లీ: కోవిడ్ చికిత్స తీసుకున్నాక బాక్టీరియా, ఫంగస్‌ తదితర సెకండరీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడ్డ రోగుల్లో సగం మంది మృత్యువాత పడుతున్నారని  ఐసీఎంఆర్‌ చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. చికిత్సానంతరం కొవిడ్‌ రోగులు ఆస్ప్రతిలో సోకే వ్యాధులు, బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నట్లు కనుగొన్నారు. 

17, 534 మంది కొవిడ్ రోగులపై గతేడాది జూన్‌-ఆగస్టు మధ్య ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. అందులో మొత్తం కొవిడ్‌ రోగుల్లో 3.6శాతం మంది తిరిగి బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ వ్యాధుల బారిన పడుతున్నారని తేలింది. ఈ సెకండరీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన రోగుల్లో 56.7 శాతం మంది మరణిస్తున్నట్లు గుర్తించారు. కాకపోతే బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ వ్యాధులకు గురైన వారంతా కొవిడ్‌ వచ్చినప్పుడు ఐసీయూలో చికిత్స పొందినవారే కావడం గమనార్హం. 

కొవిడ్ చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి సోకే ఇన్‌ఫెక్షన్లు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సెకండరీ ఇన్‌ఫెక్షన్లలో  రక్తం, శ్వాస వ్యవస్థ ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు కనుగొన్నారు. ఇదిలా ఉంటే కొవిడ్ చికిత్స సందర్భంగా యాంటీ బయాటిక్స్‌ను అతిగా ఉపయోగించడం వల్ల రోగుల్లో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని, తద్వారా ఔషధ నిరోధకత ఏర్పడుతోందనీ, రోగులు చికిత్సకు స్పందించకుండా తయారవుతారనీ ఐసీఎంఆర్‌ తెలిపింది. దీన్ని  అరికట్టడానికి  విచక్షణారహితంగా  యాంటీబయాటిక్స్‌ను  ఉపయోగించకుండా చూడాలని ఐసీఎంఆర్‌ సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని