Omicron: ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!

ప్రపంచ దేశాలకు వణుకుపుట్టిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ను ‘అత్యంత ఆందోళనకర రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది. తాజాగా సింగపూర్‌ ఆరోగ్యశాఖ ఈ

Updated : 06 Dec 2021 16:40 IST

సింగపూర్‌ ఆరోగ్యశాఖ వెల్లడి

సింగపూర్‌: ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ను ‘అత్యంత ఆందోళనకర రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది. తాజాగా సింగపూర్‌ ఆరోగ్యశాఖ ఈ వేరియంట్‌పై మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. గతంలో వెలుగుచూసిన కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే ‘ఒమిక్రాన్‌’తో రీఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపింది. ఈ మేరకు ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్‌ అధ్యయనాల ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొంది.

‘‘డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ రకం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇక గత రకాల కంటే ఈ వేరియంట్‌తో రీఇన్ఫెక్షన్‌ ముప్పు అధికంగా ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే.. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశాలూ ఎక్కువే’’ అని సింగపూర్‌ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు సమర్థంగా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడం, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతమున్న టీకాలు కొంతవరకు పనిచేస్తున్నాయని పలు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు పేర్కొంది. అంతేగాక, ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయితే ఈ అంశాలతో ఒమిక్రాన్‌పై అభిప్రాయానికి రావడం సరికాదని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అప్పటివరకు ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, టీకాలు, బూస్టర్‌ డోసులు తీసుకోవాలని అభ్యర్థించింది.

సింగపూర్‌లో ఆదివారం మరో ఒమిక్రాన్ అనుమానిత కేసు వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా తేలిందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న సదరు మహిళ.. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుంచి సింగపూర్​కు వచ్చిన మరో ఇద్దరు ఒమిక్రాన్ అనుమానిత వ్యక్తులు ప్రయాణించిన విమానంలోనే ఉన్నట్లు చెప్పింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో మూడు ఒమిక్రాన్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. బాధితుల రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని