కరోనా రెండో విజృంభణ.. కారణాలు ఏంటంటే?

సెకండ్‌ వేవ్‌కు మ్యుటేషన్‌ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Published : 26 Mar 2021 15:49 IST

ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌ విశ్లేషణ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కొత్తగా మ్యుటేషన్‌ చెందిన రకాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సెకండ్‌ వేవ్‌కు మ్యుటేషన్‌ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజుల్లోనే దేశంలో మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరగడానికి గల కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌కు కారణాలు..?

దేశంలో గత కొన్నిరోజులుగా మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం రికార్డు స్థాయి కేసులు బయటపడుతున్నాయి. ఇలా వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడమే ముఖ్య కారణమని భార‌త‌దేశ అత్యున్న‌త సైన్స్ పుర‌స్కారమైన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ గ్రహీత, ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌ స్పష్టం చేశారు. దేశంలో వైరస్‌ సోకే అవకాశమున్న వారి సంఖ్య ఇంకా అధికంగా ఉండడంతో పాటు గత నాలుగు నెలలుగా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే సెకండ్‌ వేవ్‌కు దారితీసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మహమ్మారి తీవ్రత కొనసాగుతోన్న సమయంలోనే వ్యాపార, వినోద కార్యకలాపాలు పూర్వస్థితికి రావడం కూడా ఇందుకు కారణమని షాహిద్‌ జమీల్‌ విశ్లేషించారు.

మ్యుటేషన్‌ చెందిన రకాలు‌ కారణమా..?

కరోనా సెకండ్‌ వేవ్‌కు మ్యుటేషన్‌ చెందిన రకాలే కారణమని చెప్పేందుకు ఎలాంటి రుజువులు లేనప్పటికీ అది కూడా ఓ కారణం అయ్యే అవకాశం ఉందని షాహిద్‌ జమీల్ అభిప్రాయపడ్డారు. తొలి దఫా విజృంభణతో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ కాలంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఇక దేశంలో కొన్ని చోట్ల డబుల్‌ మ్యుటేషన్‌ చెందినట్లు వస్తోన్న నివేదికలపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి వైరస్‌ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషన్లు కారణమని చెప్పలేమని, కానీ, అది కూడా సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. దేశంలో కొత్తగా వెలుగుచూస్తున్న మ్యుటేషన్‌లపై ఎప్పటికప్పుడు పరిశోధన జరుగుతోందన్నారు.

కలవరపెడుతోన్న డబుల్ మ్యుటేషన్‌..!

దేశంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోన్న వేళ కరోనా వైరస్‌ ‘డబుల్‌ మ్యుటేషన్‌’ వెలుగుచూడడం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిలలో వెలుగు చూసిన కొత్తరకాలతో పాటు దేశంలో కొత్తగా ‘డబుల్‌ మ్యుటేషన్ వైరస్‌’ను గుర్తించినట్లు ఈ మధ్యే కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, దిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో L452R, E484Q మ్యుటేషన్‌ రకాలలో మార్పులను గమనించినట్లు పేర్కొంది. వైరస్‌ ఉద్ధృతికి ఈ మ్యుటేషన్‌లే కారణమా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది. ఇక వైరస్‌లోని రెండు ఉత్పరివర్తనాలు కలిసి ఒకే రకంగా మారడాన్నే ‘డబుల్‌ మ్యుటేషన్‌’గా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌లో వెలుగు చూసిన L452R, E484Q మ్యుటేషన్‌ రకాల స్పైక్‌ ప్రొటీన్‌లలోని గ్రహకాలు కలిసిపోయి కొత్తరకంగా మారుతున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా మ్యుటేషన్ చెందిన రకాలు కలిసిపోవడం సాధారణ ప్రక్రియేనని వైరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యాక్సినేషన్‌తో కట్టడి..

కొవిడ్‌ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. దీన్ని కట్టడిచేసేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, దేశంలో ఇప్పటివరకు కేవలం 5కోట్ల 55లక్షల డోసులను (మార్చి 26నాటికి) మాత్రమే పంపిణీ చేశారు. ఇది మొత్తం దేశ జనాభాలో 3.3శాతం మాత్రమే. ఇందులో కేవలం 85లక్షల మంది (0.6శాతం) మాత్రమే ఇప్పటి వరకు రెండు డోసులను తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన మేర వ్యాక్సిన్‌ పంపిణీ జరగడం లేదని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని